ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 11, 2021, 10:50 PM IST

ETV Bharat / state

CORONA EFFECT: అసంఘటిత రంగ కార్మికులపై కరోనా పిడుగు

వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని దినసరి కూలీలు.. పనిచేయనిదే పూట గడవదు. ఇలాంటి అసంఘటిత కార్మికులపై కరోనా పిడుగు పడింది. సాధారణ రోజుల్లోనే అడ్డా మీదకు చేరితే పని దొరకడం గగనం. అలాంటిది కరోనా కాలం.. పైగా కర్ఫ్యూ ఆంక్షలతో నిత్యం పని దొరకడం లేదు. గుంటూరులో అడ్డా కూలీల బతుకులు దుర్భరంగా మారాయి.

CORONA EFFECT ON LABOURS: అసంఘటిత రంగ కార్మికులపై కరోనా పిడుగు
CORONA EFFECT ON LABOURS: అసంఘటిత రంగ కార్మికులపై కరోనా పిడుగు


కొవిడ్ దెబ్బకు సామాన్యుల జీవితాలు తలకిందులయ్యాయి. కరోనా రక్కసితో అన్ని రంగాలూ కుదేలవగా.. అసంఘటిత కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గుంటూరులో వేలమంది నిరుపేద కూలీలు ఉపాధి లేక, ఇల్లు గడవక తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో చేసిన అప్పుల నుంచి ఇంకా తేరుకోకముందే.. కరోనా సెకండ్‌ వేవ్‌ వారి పాలిట శరాఘాతమైంది. కొవిడ్ భయంతో అంతంతమాత్రంగా ఉన్న ఉపాధి పనులు.. కర్ఫ్యూ కారణంగా పూర్తిగా కనుమరుగయ్యాయి.

CORONA EFFECT ON LABOURS: అసంఘటిత రంగ కార్మికులపై కరోనా పిడుగు

గుంటూరులోని లాడ్జ్ సెంటర్, గాంధీపార్కు, చుట్టుగుంట ప్రాంతాల్లో పనుల కోసం కూలీలకు రోడ్డుపై ఎదురుచూపులు తప్పడం లేదు. భవన నిర్మాణ పనులు, ముఠా పనులు, మట్టి పనులు, వ్యవసాయ పనులు.. ఏ పని అప్పగించినా చేసేందుకు వీరంతా సిద్ధంగా ఉంటారు. కర్ఫ్యూ నిబంధనలకు తోడు ఇసుక పూర్తి స్థాయిలో లభ్యం కాక పనులు జోరందుకోవడం లేదు. ఓవైపు కరోనా భయం.. మరోవైపు ఆకలి యాతనతో వారు అగచాట్లు పడుతున్నారు.

రేషన్ బియ్యం వరకు ఇబ్బందులు లేకున్నా.. మిగతా సరుకులు, ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు, పిల్లల చదువుల ఖర్చులతో నిరుపేదలు అల్లాడుతున్నారు. ప్రధానంగా చుక్కలు తాకుతున్న నిత్యావసర ధరలతో నిరుపేదలు విలవిల్లాడుతున్నారు. ధరలు అమాంతం పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా కరాళనృత్యం చేస్తున్నవేళ ఉపాధి లేక.. ఉనికే ప్రశ్నార్థకమవుతున్న పరిస్థితుల్లో.. ప్రభుత్వాలు తమకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని కూలీలు, కార్మికులు వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి

'కరకట్ట వెంట చేపట్టిన ఇసుక తవ్వకాలను నిలిపివేయాలి'

ABOUT THE AUTHOR

...view details