ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 13, 2021, 6:56 AM IST

ETV Bharat / state

wind energy: సముద్ర గాలుల నుంచి విద్యుత్‌.. కేఎల్‌యూ ఆచార్యుడి వెల్లడి

సముద్ర గాలుల నుంచి కాలుష్య రహిత విద్యుత్‌ తయారవుతుందని గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్‌ విశ్వవిద్యాలయం ఈసీఈ విభాగం సహ ఆచార్యులు చినసత్యనారాయణ పరిశోధనలో వెల్లడైంది. రాష్ట్రంలో అపారమైన వనరులున్నాయని.. సగటున ఒక్కో గాలిమర నుంచి ఏడాదికి 300 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చని ఆయన తెలిపారు.

chinna-satyanarayana-reveals-that-electricity-is-generated-from-sea-winds
సముద్ర గాలుల నుంచి విద్యుత్‌.. కేఎల్‌యూ ఆచార్యుడి వెల్లడి

రాష్ట్రంలో సముద్రతీరం పొడవునా సాగవుతున్న ఆక్వా, అనుబంధ పరిశ్రమల విద్యుత్‌ అవసరాలను పవనం ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన తన పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. ఏపీకి ఉన్న 975 కిలోమీటర్ల తీరం పొడవునా... అర కిలోమీటరు దూరంలో గాలిమర(విండ్‌మిల్‌)లను ఏర్పాటు చేసుకోవచ్చంటూ సోదాహరణలతో వివరించారు. అమెరికా ప్రఖ్యాత జర్నల్‌ రాయల్‌ మెట్రోలాజికల్‌ సొసైటీ, బెంగళూరుకు చెందిన జర్నల్‌ ఆఫ్‌ ఎర్త్‌ సిస్టం సైన్సు జర్నళ్లలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇది ప్రచురితమైంది. మనదేశంలో గుజరాత్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకల్లో విద్యుత్‌ ఉత్పత్తి కోసం గాలిమరలు ఉన్నాయి. ఏపీలో ఉన్న వనరుల దృష్ట్యా సగటున ఒక్కో గాలిమర నుంచి ఏడాదికి 300 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చు.

అయినప్పటికీ ప్రస్తుతం చాలా చిన్న మరలే ఏర్పాటయ్యాయి. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోనే గాలిమరలు ఎక్కువ. సరైన అవగాహన లేక కొందరు మరలను ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేసుకుని నష్టపోయారు. సముద్రగాలులు మచిలీపట్నంలో బాగా వీస్తుంటే... విజయవాడ పరిసరాల్లో గాలిమరలను ఏర్పాటు చేసిన వారూ లేకపోలేదు. 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన టర్బయిన్లు ఏడాది పొడవునా విరామం లేకుండా పనిచేస్తే 4,380 మెగావాట్ల విద్యుత్‌ వస్తుంది. నేషనల్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ (ఎన్‌ఆర్‌ఈపీ) గణాంకాల ప్రకారం ఏపీలో 1994 నుంచి 2021 మార్చి వరకు పరిశీలిస్తే 4,083.57 మెగావాట్లు ఉత్పత్తి అయింది. 2018, 19 సంవత్సరాల్లో రాష్ట్రంలో పవన విద్యుత్‌ గణనీయంగా తగ్గింది. కేంద్ర ప్రభుత్వ సర్వే ప్రకారం 4 మెగావాట్ల విద్యుత్‌ మాత్రమే ఉత్పత్తి అయింది.

40 ఏళ్ల సమాచార విశ్లేషణ

  • దేశంలో పవన విద్యుత్‌ ఎక్కడెక్కడ ఉత్పత్తి చేస్తున్నారో తెలుసుకోవటానికి కేఎల్‌యూలోని సూపర్‌కంప్యూటర్‌ నుంచి శాటిలైట్లు, ఏడబ్ల్యూఎస్‌, రాడార్‌ తదితర డేటాలను చినసత్యనారాయణ విశ్లేషించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ పవన విద్యుత్‌ తయారవుతోంది? అనువైన ప్రాంతాలు ఎక్కడున్నాయో గుర్తించారు. ఈ సమాచారం కోసం 40 ఏళ్ల సమాచారాన్ని(గంటల వారీగా) పరిశీలించారు.
  • పవన వేగం ఆధారంగా మరలు సెకనుకు 3.5, 4.5, 5.4, 6.7 మీటర్ల్లు తిరిగే ప్రదేశాలను గుర్తించారు. సెకనుకు 4.5 మీటర్ల వేగంతో తిరిగే మరలను రోజులో ఎన్ని గంటలు నడిపితే సగటున ఎంత విద్యుత్‌ వస్తుందో విశ్లేషించారు.
  • అధిక ఉష్ణోగ్రతలను నిలువరించాలన్నా... కాలానుగుణంగా వర్షాలు పడాలన్నా కాలుష్యాన్ని తగ్గించాలని, కాలుష్య నివారణకు సముద్ర పవన విద్యుత్‌ ఉత్పత్తికి శ్రీకారం చుట్టాలని చినసత్యనారాయణ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

GANESH IMMERSION: కోలాహలంగా గణేశ్ నిమజ్జనాలు.. పలుచోట్ల అపశ్రుతులు

ABOUT THE AUTHOR

...view details