రాష్ట్రాభివృద్ధి కోసం భాజపాతో పోరాటం చేశామే తప్ప.. మోదీతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవన్న చంద్రబాబు వ్యాఖ్యలపై భాజపా ఎమ్మెల్సీ సోమువీర్రాజు మండిపడ్డారు. చంద్రబాబు కొత్త నాటకానికి తెరతీశారని విమర్శించారు. ప్రజాధనంతో సచివాలయాలకు వైకాపా రంగులు వేయడాన్ని తప్పుపట్టిన ఆయన..వెంటనే రంగులు మార్చి మహాత్ముడి ఫొటోలు పెట్టాలని డిమాండ్ చేశారు.
'పంచాయతీల రంగులు మార్చి... గాంధీ ఫొటో పెట్టండి'
By
Published : Oct 17, 2019, 8:42 PM IST
'పంచాయతీల రంగులు మార్చి... గాంధీ ఫొటో పెట్టండి'
కేంద్రంతో సంబంధాలు వదులుకోవడం తెదేపా చేసిన తప్పిదమని భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. సంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు.. మోదీతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ధర్మపోరాట దీక్షలని నానా రాద్ధాంతంతో మోదీపై చేసిన విమర్శలు మర్చిపోయారా అని ప్రశ్నించారు. భాజపాతో పొత్తు తెగతెంపులు చేసుకోవడం తప్పే అన్న కొత్త నాటకానికి తెదేపా తెరతీసిందని వీర్రాజు ఎద్దేవా చేశారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తీసుకోస్తామని హామీలిచ్చి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తున్న రాష్ట్రప్రభుత్వం... ప్రజాధనంతో పంచాయతీ భవనాలకు వైకాపా రంగులేయడం సరికాదన్నారు. వెంటనే రంగులు మార్చి ప్రతీ సచివాలయంలో గాంధీజీ ఫొటో పెట్టాలని డిమాండ్ చేశారు.