ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మహాశివరాత్రి వేడుకలకు కోటప్పకొండ ముస్తాబు

By

Published : Mar 11, 2021, 2:52 AM IST

Updated : Mar 11, 2021, 10:25 AM IST

శివరాత్రి పర్వదినాన కోటప్పకొండ దర్శనం భక్తులకు గొప్ప అనుభవం. ఆధ్యాత్మికంగానే కాక పర్యాటకంగానూ గుంటూరు జిల్లాలోని ఈ శైవక్షేత్రం ప్రసిద్ధి...!. ఇక్కడ కొలువైన త్రికోటేశ్వరస్వామి దర్శనానికి లక్షలాది భక్తులు తరలివస్తారు. అందుకు తగ్గట్లే ఈసారి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామివారికి అర్ధరాత్రి 2 గంటలకు తొలిపూజ నిర్వహించగా.. సాయంత్రం 6 గంటలకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు బహుకరించనున్నారు.

Maha Shivratri celebrations at Kotappakonda
మహాశివరాత్రి వేడుకకు కోటప్పకొండ ముస్తాబు

మహాశివరాత్రి వేడుకలకు కోటప్పకొండ ముస్తాబు

శైవక్షేత్రాల్లో గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ త్రికోటేశ్వరాలయానిది ప్రత్యేకస్థానం. ఈ కొండపై త్రికోటేశ్వరునిగా శివయ్య దర్శనమిస్తాడు. త్రికూఠాధిపతులుగా చెప్పుకునే 3 కొండల మధ్య శివుడు వెలిసినట్లు భక్తుల నమ్మకం. ఈశ్వరుడు మేధా దక్షిణామూర్తి స్వరూపంగా ఈ కొండపైనే తపస్సు చేశాడని స్థలపురాణం చెబుతోంది. దక్షయజ్ఞం తర్వాత ఈశ్వరుడు సతీవియోగంతో ప్రశాంతత కోసం త్రికూటాద్రిపై తపస్సు చేసుకుంటుండగా.. బ్రహ్మ, విష్ణువు, సకల దేవతలు స్వామివారి కటాక్షానికి ఇక్కడికి వచ్చి తపస్సు చేశారని భక్తుల విశ్వాసం. అందువల్ల త్రికూటాలపై ముగ్గురినీ భారీవిగ్రహల రూపంలో ఇక్కడ ప్రతిష్ఠించారు.

విద్యుత్ ప్రభలతో రావడం ప్రత్యేకత..

ఇక్కడ జరిగే శివరాత్రి ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు ఇక్కడికి తరలివస్తారు. స్వామి కటాక్షానికి పొరుగు గ్రామాల ప్రజలు పెద్దఎత్తున విద్యుత్ ప్రభలతో రావడం ప్రత్యేకత. 80 నుంచి 100 అడుగుల ఎత్తున నిర్మించే విద్యుత్ ప్రభలు వెలుగులు విరజిమ్ముతూ.. ఆధ్యాత్మికత పంచుతాయి. ఏళ్ల నుంచి వస్తున్న ఆచారాన్ని క్రమం తప్పకుండా పాటిస్తూ శివయ్యను ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు.

పుర ఎన్నికల కారణంగా ఈసారి ఒకరోజు ముందుగానే ప్రభలను తరలించారు. రాత్రంతా జాగరణ చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందుకే శివరాత్రి వచ్చిందంటే చిలకలూరిపేట, నరసరావుపేటలో పండగ సంబరాలు అంబరాన్ని అంటుతాయి.

భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..

కోటప్పకొండపై ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 750 బస్సులు ఏర్పాటు చేసింది. నరసరావుపేట నుంచి 180, చిలకలూరిపేట నుంచి 120 సర్వీసులు నడపనుంది. కొండ కింద నుంచి పైవరకూ 50 బస్సుల్ని ఏర్పాటు చేశారు. భక్తుల కోసం లడ్డూలు, అరిసెల రూపంలో అన్నప్రసాదాలు సిద్ధమయ్యాయి. ఉత్సవాలకు హాజరవనున్న దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్... త్రికూటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

ఇదీచూడండి:

గజవాహనంపై సతీసమేతుడైన మల్లన్న ఊరేగింపు

Last Updated : Mar 11, 2021, 10:25 AM IST

ABOUT THE AUTHOR

...view details