ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 30, 2023, 7:31 AM IST

ETV Bharat / state

Pradhan Mantri Awas Yojana: ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ఇళ్ల నిర్మాణంలో ఏపీ వెనుకబాటు

AP Is Lagging Behind In House Construction: పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఊదరగొడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆశించిన మేర పనులు జరగడం లేదు. గ్రామీణ ప్రాంతాల ఇళ్ల నిర్మాణంలో దేశంలోనే ఏపీ ఎంతో వెనకబడిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రధానమంత్రి ఆవాస యోజన కింద 9 నెలల్లో 98వేలకు పైగా ఇళ్లనిర్మాణం పూర్తిచేయాల్సి ఉండగా కేవలం 55 ఇళ్లు మాత్రమే నిర్మించినట్లు తెలిపింది.

Pradhan Mantri Awas Yojana
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ఇళ్ల నిర్మాణంలో ఏపీ వెనుకబాటు

AP Is Lagging Behind In House Construction: ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ఇళ్ల నిర్మాణంలో ఏపీ పనితీరు ఏమాత్రం బాగోలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 20 సూత్రాల కార్యక్రమం- 2006 అమలులో భాగంగా 2022 ఏప్రిల్‌- డిసెంబర్‌ మధ్య మూడు త్రైమాసికాల్లో రాష్ట్రాలు సాధించిన పురోగతిపై కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.

కేవలం 55 ఇళ్లు మాత్రమే :2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో లక్షా 31 వేల348 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.. ఇందులో 2022 ఏప్రిల్‌- డిసెంబరు మధ్య కాలంలోనే 98వేల511 ఇళ్లు పూర్తి చేయాల్సి ఉంది. అయితే కేవలం 55 ఇళ్లు మాత్రమే రాష్ట్రంలో నిర్మించారు. మొత్తం లక్ష్యంలో ఇది సున్నా శాతమని నివేదికలో పేర్కొంది. అల్పాదాయ వర్గాల కోసం పట్టణ ప్రాంతాల్లో లక్షా 90వేల ఇళ్లు పూర్తి చేసినా గ్రామీణ ప్రాంతాల్లో ఇదే కాలంలో కేవలం 3,956 వ్యక్తిగత మరుగుదొడ్లు మాత్రమే నిర్మించింది.

కేంద్రం నివేదిక :9,917 స్వయం సహాయ సంఘాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 646 మాత్రమే ఏర్పాటు చేసింది. 6శాతం లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అధ్వాన పనితీరు కనబరిచినట్లు కేంద్రం నివేదికలో వెల్లడించింది. 2వేల909 స్వయం సహాయక సంఘాలకు కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సమకూర్చాల్సి ఉండగా ఒక్కదానికీ ఏమీ ఇవ్వలేదు. సున్నా లక్ష్యసాధనతో ఈ విభాగంలోనూ ఏపీ ఎంతో వెనకబడి ఉంది. రాష్ట్రంలో భూమిలేని ఎస్సీ, ఎస్టీ, ఇతర నిరుపేదలకు హెక్టార్‌ భూమిని కూడా పంచలేదు.

'పూర్‌'గా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం : జాతీయ ఆహార భద్రత చట్టం విభాగంలో రాష్ట్రానికి 16,551 టన్నుల ఆహారధాన్యాలు కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం 3,977 టన్నులు మాత్రమే తీసుకొని 'పూర్‌'గా నిలిచింది. ఈ 9 నెలల్లో లక్షా53 వేల 300 హెక్టార్లలో అటవీ విస్తరణ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండగా 33,808 హెక్టార్లలో మాత్రమే పని జరిగింది. 9 కోట్ల96 లక్షల 45 వేలు మొక్కలు నాటాల్సి ఉండగా 3 కోట్ల 4 లక్షల 84 వేల మొక్కులు మాత్రమే నాటారు. ఇందులోనూ ఏపీ ఎంతో వెనకబడి ఉందని గణాంకాలతో సహా కేంద్రం వెల్లడించింది. పీఎమ్​​జీఎస్​వై కింద 16 వందల 20 కిలోమీటర్ల గ్రామీణ రహదారులు నిర్మించాల్సి ఉండగా కేవలం 580 కిలోమీటర్ల మాత్రమే పూర్తి చేశారు.

257 ఐసీడీఎస్‌ బ్లాక్స్‌ను ఆపరేషనల్‌లోకి తేవాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విభాగంలో మాత్రం వందశాతం లక్ష్యాన్ని సాధించింది. యూపీ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలు వందశాతం లక్ష్యాన్ని సాధించాయి. 55 వేల607 అంగన్‌వాడీలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోగా అన్నీ అమల్లోకి వచ్చాయి. సెవెన్‌ పాయింట్‌ ఛార్టర్‌ కింద 5 లక్షల 5 వేల962కుటుంబాలకు సాయం అందింది.

'వెరీగుడ్‌' రాష్ట్రాల జాబితా :18వేల 639 పంపుసెట్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాల్సి ఉండగా 98 వేల 447 పంపుసెట్లకు అందించి 528 శాతం లక్ష్యాన్ని సాధించి ఈ విభాగంలో 'వెరీగుడ్‌' రాష్ట్రాల జాబితాలో నిలిచింది. 2022 ఏప్రిల్‌- డిసెంబర్‌ మధ్య 53 వేల 292 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌కుగానూ 52 వేల 883 మిలియన్ యూనిట్లు సరఫరా చేసి 99 శాతం లక్ష్యాన్ని చేరుకొంది. ఈ విషయంలో దక్షిణాదిలోని మిగతా రాష్ట్రాలన్నీ 100% లక్ష్యం సాధించాయి. ప్రజాపంపిణీ వ్యవస్థ కింద ఆహారధాన్యాల్లో 99 శాతం, జాతీయ ఆహారభద్రత చట్టం కింద పూర్తి స్థాయిలో ఆహార ధాన్యాలు తీసుకుంది. ఈ రెండు విషయాల్లోనూ 'వెరీగుడ్‌' రాష్ట్రాల జాబితాలో చేరింది.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details