ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 12, 2020, 6:46 PM IST

Updated : Nov 12, 2020, 9:20 PM IST

ETV Bharat / state

రాజధాని రైతుల విడుదల.. ఘన స్వాగతం

మూడు రాజధానులకు మద్దతుగా దీక్షలకు వెళ్తున్న వారిని అడ్డుకున్న కేసులో అరెస్టయిన కృష్ణాయపాలెం రైతులు గురువారం గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. వారికి అమరావతి ఐకాస, తెదేపా, సీపీఐ నేతలు ఘన స్వాగతం పలికారు. అరెస్టులతో అమరావతి ఆకాంక్షని చంపలేరని రైతులు నేతలు స్పష్టం చేశారు.

Amaravathi farmers released from Gunturu district jail
Amaravathi farmers released from Gunturu district jail

రైతులకు ఘన స్వాగతం

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంకు చెందిన ఏడుగురు రైతులు గురువారం గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. బుధవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన మేరకు.. రైతులను జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. బెయిల్ కాగితాలు జైలు అధికారులకు అందజేసినా... రైతులను విడుదల చేసేందుకు 4 గంటల సమయం తీసుకున్నారు. అనంతరం కుక్కమళ్ల అమర్, నంబూరు రామారావు, ఈపూరి సందీప్, ఈపూరి రవికాంత్, ఈపూరి కిషోర్, సొంఠి నరేష్, దానబోయిన బాజీ.. కారాగారం నుంచి విడుదలయ్యారు. అమరావతి ఐకాసతో పాటు తెదేపా, సీపీఐ నేతలు రైతులకు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ఎస్సీలపైనే అట్రాసిటి కేసులు పెట్టిన పోలీసుల వైఖరిని రైతులు ఖండించారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరెస్టులతో అమరావతి ఉద్యమాన్ని ఆపలేరని ఐకాస నేతలు, రాజధాని రైతులు స్పష్టం చేశారు.

'ఐపీసీ బదులు వైసీపీ సెక్షన్లు అమలు'

దళితులకు అంబేడ్కర్ కల్పించిన హక్కులను ఖననం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు విమర్శించారు. రైతులు ఏం తప్పు చేశారని ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి జైలుకు పంపారని ప్రశ్నించారు. గుంటూరు పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్లకు బదులు వైసీపీ సెక్షన్లు మాత్రమే అమలవుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే రైతులపై అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. రైతులకు బేడీలు వేయడం దేశ చరిత్రలో ఎక్కడా లేదన్నారు.

రైతుల ఊరేగింపు

జైలు నుంచి విడుదలైన రైతులతో కలిసి ఐకాస, తెదేపా నేతలు అంబేడ్కర్ విగ్రహం వరకూ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పరిరక్షించేలా చూడాలని వేడుకున్నారు. రైతులకు స్వాగతం పలికిన వారిలో అమరావతి ఐకాస నేతలు సుధాకర్, మల్లికార్జున, శైలజతో పాటు తెదేపా నేతలు ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు, తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు.

ఇదీ చదవండి:

ప్రాథమిక దర్యాప్తు చేయకుండా అరెస్ట్ చేస్తారా?: హైకోర్టు

Last Updated : Nov 12, 2020, 9:20 PM IST

ABOUT THE AUTHOR

...view details