పల్నాడు ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలని గుంటూరు జిల్లా మాచవరం గ్రామంలో అఖిలపక్ష నేతలు సమావేశం నిర్వహించారు. సాహసాల పురిటిగడ్డగా పేరొందిన పల్నాడు కేంద్రంగానే జిల్లా ఏర్పాటు చేయాలనే వాదనను గట్టిగా వినిపించారు. జై పల్నాడు అనే నినాదంతో సమావేశ ప్రాంగణమంతా మారుమోగింది. పల్నాడు ప్రాంతంలోని రంగుల జెండాలను పక్కనపెట్టి జిల్లానే ప్రధాన ఎజెండాగా స్థానిక నాయకులు పోరాడాలని కృష్ణాంజనేయులు సూచించారు. ఈ కార్యక్రమానికి తెదేపా మాజీ ఎమ్మేల్యే యరపతినేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జై పల్నాడు అనే నినాదమే ప్రస్తుత తమ వాదమని ఆయన అన్నారు.
'పల్నాడును జిల్లాగా ప్రకటించే వరకు పోరాడతాం' - మాచవరంలో అఖిలపక్ష నేతల సమావేశం
వెన్నుచూపని వీరులు జన్మించిన పల్నాడు ప్రాంత జిల్లా సాధనకై ... తన పోరాటం సాగిస్తానని తెదేపా మాజీ ఎమ్మేల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. వనరులు సంవృద్ధిగా కలిగిన పల్నాడును జిల్లాగా చేయడంపై... అధికార పార్టీ పెదవి విప్పకపోవడం శోచనీయమన్నారు. కుల, మత, పార్టీ విభేదాలను మరిచి పల్నాడు ప్రాంత సంక్షేమం కొరకు పోరాడాలని పిలుపునిచ్చారు.

పల్నాడు జిల్లా సాదించే వరకు ఫోన్ వస్తే జై పల్నాడు అనాలే కానీ హలో అనకూడదని ప్రజలకు సూచన చేశారు. ఈ ప్రాంత చరిత్ర గొప్పతనం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసినంతగా అధికార పార్టీ నాయకులకు ఎందుకు అర్దం కావటం లేదని యరపతినేని ఎద్దేవా చేశారు. కుల, మత, పార్టీ విభేదాలను మరిచి పల్నాడు ప్రాంత సంక్షేమం కోసం పోరాడాలన్నారు. ఇకనైనా పల్నాడు ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండీ...సీఎంఆర్ గ్రూప్నకు సెట్బ్యాక్ మినహాయింపులు ఇస్తూ ఉత్తర్వులు