ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 28, 2023, 7:04 AM IST

ETV Bharat / state

అమలు నిలిపివేయాలి.. ఆర్​-5 జోన్​ గెజిట్​పై హైకోర్టులో పిటిషన్​

LAWSUIT AGAINST R5 ZONE GAZETTE NOTIFICATION: రాజధాని అమరావతిలో ఆర్-5 జోన్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21న జారీ చేసిన గెజిట్ (337) నోటిఫికేషన్​ను సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన ఆవల నందకిశోర్ అనే రైతు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధాని అమరావతిలోని 900 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా బృహత్ ప్రణాళికలో మార్పులు చేస్తూ ఆర్-5 జోన్​ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.

LAWSUIT AGAINST R5 ZONE GAZETTE NOTIFICATION
LAWSUIT AGAINST R5 ZONE GAZETTE NOTIFICATION

LAWSUIT AGAINST R5 ZONE GAZETTE NOTIFICATION: రాజధాని అమరావతిలో ఆర్-5 జోన్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21న జారీ చేసిన గెజిట్ (337) నోటిఫికేషన్​ను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంకు చెందిన నందకిశోర్ అనే వ్యక్తి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. నవరత్నాలు పేదలందరికి ఇళ్లు పథకం పేరుతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలు, తాడేపల్లి, దుర్గిరాల, మంగళగిరి, పెదకాకాని మండలాల పరిధిలో ప్రజలకు రాజధాని కోసం సమీకరించిన 1251 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో జీవో 107 జారీ చేసిందని పిటిషనర్ వ్యాజ్యంలో తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు ఆ జీవోను సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. ఆ ఉత్తర్వులు జోనల్ రెగ్యులేషన్​కు విరుద్ధంగా ఉన్నాయని చెప్పిందని.. ఈ తరహా చర్య జోనల్ పరిధిని కుదించడమేనని పేర్కొందని తెలిపారు.

రాజకీయ అజెండా అమల్లో భాగంగా రాజధానేతరులకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం సీఆర్డీఏ సవరణ చట్టం(యాక్ట్ 13) తీసుకొచ్చిందని పిటిషన్​లో పొందుపరిచారు. దానిని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు ఉన్నత న్యాయస్థానం త్రిసభ్య ధర్మాసనం వద్దకు చేరాయి. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చే సమయంలో.. జీవో 107ని సవాలు చేస్తూ దాఖలైన పాత కేసుతో జతచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో త్రిసభ్య ధర్మాసనం వద్దకు చేరాయన్నారు. ఈ వ్యవహారాన్ని అవకాశంగా తీసుకున్న ప్రభుత్వం.. సీఆర్డీఏ ప్రస్తుత గెజిట్​ను జారీ చేసిందని.. కృష్ణాయపాలెం గ్రామ పంచాయతీ ప్రజలు లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోలేదన్నారు. సీఆర్డీఏ కమిషనర్, కృష్ణాయపాలెం ప్రత్యేక అధికారి ఈ వ్యవహారంలో దురుద్దేశంతో వ్యవహరించారన్నారు.

ఆర్5 జోన్ ఏర్పాటుకు కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, మందడం గ్రామాల పరిధిలో ప్రతిపాదించిన భూములు రాజధాని నగరం స్వతహాగా నిలదొక్కుకోవడానికి, ఆదాయం అర్జించేందుకు ఉపయోగపడే భూములని పిటిషనర్ తెలిపారు. అవి రాజధాని అమరావతికి కీలకమైనవని.. ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారమై గ్రామస్థుల నుంచి ఎలాంటి అభ్యర్థనలు రాకపోయినప్పటికీ ప్రత్యేక అధికారి సీఆర్డీఏకి ప్రతిపాదన చేశారన్నారు. దాని ఆధారంగా సీఆర్డీఏ తీర్మానం చేసిందని.. ప్రత్యేక అధికారి అలాంటి ప్రతిపాదన చేయడం అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడటమే అవుతుందన్నారు.

పంచాయతీరాజ్ చట్ట నిబంధనల మేరకు నియమితులైన ప్రత్యేక అధికారికి.. సీఆర్డీఏ తీర్మానంతో సంబంధం ఉండదన్నారు. గ్రామ సభలు నిర్వహించాలని కోర్టుకు వెళ్లామని.. న్యాయస్థానం ఆదేశాలతో సభలు నిర్వహించారని పిటిషన్​లో తెలిపారు. ఆ సభల్లో ప్రజలు లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకుండా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. సీఆర్డీఏ అధికారుల మౌఖిక సూచన మేరకు ఇళ్ల స్థలాల కోసం ప్రతిపాదన చేసినట్లు గ్రామ సభలో కృష్ణాయపాలెం ప్రత్యేక అధికారి చెప్పారని తెలిపారు. ఈ ప్రతిపాదన వందల మంది రైతుల ప్రయోజనాలు, వారి కుటుంబాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని.. ఈ నేపథ్యంలో ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ గ్రామ సభ ఏకగ్రీవకంగా తీర్మానం చేసిందన్నారు.

గ్రామ సభ తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకోవడంలో సీఆర్డీఏ విఫలమైందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని గెజిట్ నోటిఫికేషన్​ను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించి. దానిని రద్దు చేయాలని కోరారు. అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలను హైకోర్టుకు విన్నవించారు. గ్రామ ప్రజలు సమర్పించిన అభ్యంతరాలు, అధికారుల నిర్ణయానికి సంబంధించిన నోట్​ ఫైల్​ను తెప్పించి పరిశీలించాలని కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details