ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండున్నరేళ్లు గడుస్తున్నా.. పునాదులు దాటని జగనన్న కాలనీల ఇళ్లు

Jagananna Colonies : సొంత ఇళ్లు నిర్మిస్తాం.. పేదవాని ఇంటి కళను నిజం చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఆ మాటను నిలబెట్టుకునేలా కనిపించడం లేదు. ఉగాది వరకు ఇళ్లు పూర్తి చేసి అందిస్తామని అధికారులు ప్రకటనలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలు కనీసం పునాదుల స్థాయినీ దాటలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

By

Published : Mar 1, 2023, 9:06 PM IST

జగనన్నకాలనీల ఇళ్ల నిర్మాణాలు
జగనన్నకాలనీల ఇళ్ల నిర్మాణాలు

ఏలూరులో నత్తనడకన సాగుతున్న జగనన్న కాలనీల్లోని ఇళ్ల నిర్మాణం

No Progress in Jagananna Colonies : జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం, అధికారులు చెప్తున్న మాటలు కోటలు దాటుతుంటే.. ఇళ్ల నిర్మాణాలు మాత్రం పునాదుల స్థాయిని దాటటం లేదు. ఏలూరు జిల్లాలో జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణం పేరుతో వందల ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఏలూరులో 458, నూజివీడులో 151, జంగారెడ్డి గూడెంలో 146 లేఆవుట్లను ఇళ్ల నిర్మాణం కోసం సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 755 లేఅవుట్లను రూపొందించగా.. అందులో సుమారు 60 వేల 414 ఇళ్లు మంజూరయ్యాయి.

ఒక్క ఎలూరు శివారు పోణంగిలోనే దాదాపు 250 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద లేఅవుట్ రూపొందించారు. అందులో 11 వేల 50 ఇళ్లను మంజూరు చేశారు. జిల్లాలో ఈ ఉగాది నాటికి 60వేల 414 ఇళ్లకు గాను, 27 వేల ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తామని ఇటీవల అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన సమయంలో ప్రకటించారు. అయితే అధికారులు చెప్పిన మాటలు క్షేత్ర స్థాయిలో పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. జిల్లాలో రూపొందించిన అన్ని లేఅవుట్లలోని పనులు ఇప్పటికీ నత్త నడకగానే సాగుతున్నాయి. కనీసం ఒక్క లేఅవుట్​లోనూ పది శాతం కూడా పూర్తి నిర్మాణం కాలేదు.

ఏ లేఅవుట్​ చూసినా కేవలం విద్యుత్​ సరఫరా కోసం ఏర్పాటు చేసిన విద్యుత్​ స్తంభాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కనీసం లేఅవుట్లలో రోడ్ల నిర్మాణాలను పూర్తి చేయలేదు. కనీస సదుపాయలపై దృష్టి పెట్టలేదు. కొన్ని చోట్ల అడుగు లోతులో పునాదులు వేసి వదిలేస్తున్నారు. మరికొన్ని చోట్ల పునాదులు ఎత్తు పల్లాలతో అస్తవ్యస్థంగా ఉంది. డ్రైనేజీ, మంచినీటి వసతి నిర్మాణ పనులు ఇంకా ప్రారంభమే కాలేదు.

ఇళ్ల నిర్మాణం పూర్తైతే ఏళ్ల తరబడి చెల్లిస్తున్న అద్దె భారం నుంచి ఉపశమనం లభిస్తుందని లబ్దిదారులు ఆశిస్తున్నారు. లబ్దిదారుల ఆశలపై క్షేత్ర స్థాయి పరిస్థితులు నీళ్లు చల్లుతున్నాయి. ప్రభుత్వం మాటిచ్చి మూడున్నరేళ్లు, లేఅవుట్లు కేటాయించి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇళ్ల నిర్మాణంలో వేగం పుంజుకోవటం లేదు. నిర్మాణాలు ఎప్పుడు పూర్తై తమపై అద్దె భారం ఎప్పుడు తప్పుతుందో అని లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు.

"జగనన్న ఇళ్ల నిర్మాణం నత్త నడకన సాగుతోంది. ప్రభుత్వం, అధికారులు ఉగాది నాటికి 27 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ఇస్తామని చెప్తున్నారు. కనీసం ఏడు వేల ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి అయ్యేలా లేవు. అనేక చోట్ల ఇళ్ల నిర్మాణాలు పునాది స్థాయిలోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మోసపూరిత మాటలు మానుకుని లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అందించాలని కోరుకుంటున్నాము." -బండి వెంకటేశ్వరరావు, స్థానికుడు

ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పగా.. కొన్నిచోట్ల లబ్దిదారులే సొంతంగా ఇళ్లు కట్టుకునేందుకు ముందుకు వచ్చారు. అలా ముందుకు వచ్చిన ఇళ్ల నిర్మాణ పనులు మాత్రమే పైకప్పు దశ వరకు చేరుకున్నాయి. కొన్ని ఇళ్లు ఫిల్లర్ల దశకు, మరికొన్ని పునాదుల దశలో నిలిచిపోయాయి. లబ్దిదారులు సొంతంగా ఇళ్లు నిర్మించుకుంటే ప్రభుత్వం వారికి లక్ష 80 వేల రూపాయలు చెల్లిస్తామని ప్రకటించింది. ప్రభుత్వం చెల్లించే నగదుతో ఇళ్ల నిర్మాణ పనులు సగం కూడా పూర్తి కావని.. కనీసం 5లక్షల రూపాయలు లేనిదే చిన్న ఇల్లు కూడా పూర్తి కాదని లబ్దిదారులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని వేడుకుంటున్నారు.

"కాంట్రాక్టర్లు ఇళ్ల నిర్మాణ పనులను నాసిరకంగా చేపడుతున్నారు. కనీసం ఒక శాతం కూడా ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని కోరుతున్నాము." - కృష్ణచైతన్య, సీపీఐ నేత

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details