ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 14, 2022, 1:13 AM IST

Updated : Apr 14, 2022, 2:00 PM IST

ETV Bharat / state

ఏలూరు జిల్లా: రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

Fire Accident In Eluru District: ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రసాయన పరిశ్రమలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు నష్టపరిహారం అందించనున్నట్లు సీఎం జగన్​ ప్రకటించారు. ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ప్రకటించిన కలెక్టర్​... ప్రమాదం ఎలా జరిగిందో నిర్దారణ అయ్యే వరకు పరిశ్రమ తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

fire accident
రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident In Eluru District: ఏలూరు జిల్లాలోని మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ పరిశ్రమలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ పరిశ్రమలో ఔషధ తయారీలో వాడే పొడి ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. రసాయన పరిశ్రమలోని నాలుగో యూనిట్‌లో మంటలు చెలరేగి.. రియాక్టర్​ పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలంలోనే ఐదుగురు సజీవదహనం కాగా.. మార్గమధ్యలో మరొకరు మృతి చెందారు.

క్షతగాత్రులను నూజివీడు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమించటంతో.. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో షిప్టులో 150 మంది పని చేస్తున్నట్లు సమాచారం. మృతుల్లో నలుగురు బిహార్​వాసులుగా గుర్తించారు.

విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎన్డీఆర్‌ఎఫ్‌బృందం సహాయక చర్యలు చేపట్టింది. ఘటనపై సమాచారం అందుకున్న ఏలూరు ఎస్పీ, నూజివీడు డీఎస్పీ.. ప్రమాదస్థలిని పరిశీలించారు. ప్రమదానికి గల కారణాలు,.. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను.. పరిశ్రమ ప్రతినిధులు పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం బాధితులను గొల్లపూడి ఆంధ్రా ఆస్పత్రికి తరలిస్తున్నారు.

పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. గేట్లు తీయకపోయేసరికి బలవంతంగా లోపలికి వెళ్లాం. అప్పటికే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది. చక్కెర కర్మాగారాన్ని రసాయన పరిశ్రమగా మార్చారు. ప్రమాదం జరిగాక కంపెనీ వాళ్లు చర్యలు తీసుకోలేదు. అంబులెన్స్‌కు కూడా ఎవరూ ఫోన్ చేయలేదు. షిఫ్టులో 150 మంది వరకు పనిచేస్తుంటారు.-బాధితులు

పరిశ్రమ ముందు ఆందోళనలు..అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ పరిశ్రమ ముందు.. పరిశ్రమ సిబ్బంది, స్థానికులు ఆందోళన చేపట్టారు. ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. పరిశ్రమలోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారంతా.. పరిశ్రమ ముందు బైఠాయించారు.

గ్రామంలో గాలి, నీరు కలుషితమై.. పరిశ్రమ నుంచి దుర్వాసన వస్తోందన్నారు. పంటలు కూడా సరిగా పండట్లేదని.. ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని ఆరోపణలు చేశారు. గ్రామం నుంచి కంపెనీని తరలించాలని డిమాండ్‌ చేశారు. ఘటనాస్థలిని నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావు పరిశీలించారు. అనంతరం గ్రామస్థులను ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొనటంతో.. పోలీసులు బందోబస్తు చేపట్టారు.

కలెక్టర్‌తో సీఎస్‌ సమీక్ష:ఏలూరు ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్‌తో సీఎస్‌ సమీర్ శర్మ సమీక్షించారు. ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు తెలుసుకున్న ఆయన.. ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రమాద ఘటన బాధాకరం:ఏలూరు ఘటనపై ఎంపీ కోటగిరి శ్రీధర్‌, ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్‌ అప్పారావు స్పందించారు. పోరస్‌ పరిశ్రమ ప్రమాద ఘటన బాధాకరమన్నారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఎంపీ శ్రీధర్‌ అన్నారు. బాధితులకు పరిహారం అందించి ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని ఎమ్మెల్యే వెంకట ప్రతాప్‌ అప్పారావు తెలిపారు.

పరిస్థితి విషమంగా ఉంది:ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం ప్రమాదంలో గాయపడిన బాధితుల పరిస్థితి.. విషమంగా ఉందని విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ సౌభాగ్యలక్ష్మి తెలిపారు. గాయపడిన 12 మందిలో ఒకరు మినహా మిగిలిన వారందిరికీ 80 శాతానికిపైగా కాలిన గాయాలయ్యాయన్నారు.

ఫ్యాక్టరీ తాత్కాలికంగా మూసివేత: ఏలూరు ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు.. కంపెనీ తరఫున రూ.25 లక్షల పరిహారం అందించనున్నట్లు ఎమ్మెల్యే ప్రతాప్‌ తెలిపారు. తీవ్రంగా గాయపడినవారికి రూ.25 లక్షలు,..తీవ్రంగా గాయపడినవారికి రూ.5 లక్షలు,.. మామూలు గాయాలైన వారికి పరిహారం అందిస్తామన్నారు. క్షతగాత్రులకు వెంటనే రూ.లక్ష పరిహారం అందించి.. ప్రైవేటు ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రమాద ఘటనపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ప్రమాదం ఎలా జరిగిందనేది నిర్ధారణ అయ్యే వరకు కంపెనీని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపారు.

Ex-gratia to fire accident victims:ఏలూరు పోరస్ రసాయన పరిశ్రమలో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై.. సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు.. ముఖ్యమంత్రి రూ.25 లక్షలు పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారంగా ప్రకటించారు.

ఇదీ చదవండి:Fire accident: ఏలూరు వ్యానిటైజ్‌ దారాల కంపెనీలో అగ్నిప్రమాదం

Last Updated : Apr 14, 2022, 2:00 PM IST

ABOUT THE AUTHOR

...view details