ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Eluru Fire Accident: ‘పోరస్‌’ ప్రమాదం.. జనం ఆందోళనతో ఫ్యాక్టరీ మూసివేత

Eluru fire accident: ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి షిఫ్టు వారు 9కి డ్యూటీ ఎక్కారు.. కొద్దిసేపటికి ఊరంతా సద్దుమణిగింది. అంతలోనే చెవులు చిల్లులుపడేలా పెద్ద శబ్దం.. గ్రామస్థులంతా ఉలిక్కిపడి లేచారు. ఏమైందోనని ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఫ్యాక్టరీలో మంటలు చూసి తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఘటనలో అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు.

By

Published : Apr 15, 2022, 7:59 AM IST

Updated : Apr 15, 2022, 11:34 AM IST

fire accident at porus chemical industry in eluru
ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో అగ్నికి ఆహుతైన పోరస్ రసాయన పరిశ్రమ

‘పోరస్‌’ ప్రమాదం.. జనం ఆందోళనతో ఫ్యాక్టరీ మూసివేత

Eluru fire accident: ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం గ్రామంలోని పోరస్‌ కెమికల్స్‌ ఫ్యాక్టరీ.. బుధవారం రాత్రి షిఫ్టు వారు 9కి డ్యూటీ ఎక్కారు.. కొద్దిసేపటికి ఊరంతా సద్దుమణిగింది. అంతలోనే చెవులు చిల్లులుపడేలా పెద్ద శబ్దం.. గ్రామస్థులంతా ఉలిక్కిపడి లేచారు. ఏమైందోనని ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఫ్యాక్టరీలో మంటలు చూసి తీవ్ర భయాందోళన చెందారు. విషవాయువులు వెలువడతాయనే భయంతో కొందరు గ్రామం వదిలి వెళ్లిపోగా మరికొందరు ఏం చేయాలో అర్థంకాక అయోమయానికి గురయ్యారు.

రసాయనాలు పేలితే ఊళ్లో కొన్ని కిలోమీటర్ల మేర ప్రభావం ఉంటుందనే ప్రచారంతో ఊరు ఊరంతా వణికిపోయింది. ఆ రాత్రి వారి పాలిట కాళరాత్రే అయింది. బుధవారం రాత్రి ఈ పరిశ్రమలో రాత్రి 10.45 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మరో 12 మంది గాయపడ్డారు. కొంతసేపటికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. మృతుల్లో నలుగురు బిహార్‌ రాష్ట్రానికి చెందినవారు కాగా.. ఇద్దరు తెలుగు వారు.

మృతులు వీరే..:అక్కిరెడ్డిగూడెంలో నివాసం ఉంటున్న బిహార్‌కు చెందిన మనోజ్‌కుమార్‌ (25), అభిదేశ్‌ రవిదాస్‌ (27), కారు రవిదాస్‌ (40), సుభాష్‌ రవిదాస్‌ (32), కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం కుదపకు చెందిన కెమిస్ట్‌ కృష్ణయ్య (36) అక్కడికక్కడే మృతి చెందారు. అక్కిరెడ్డిగూడేనికి చెందిన బొప్పిడి కిరణ్‌కుమార్‌(30) ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరణించారు.

వెంటిలేటర్‌పై ఏడుగురు..:గాయపడినవారికి గొల్లపూడి ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో తీవ్రగాయాలైన ఏడుగురికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా మిగిలినవారికి ఐసీయూలో చికిత్స చేస్తున్నారు. మూడు, నాలుగు రోజుల పరిశీలన తర్వాతే వారి పరిస్థితి ఏమిటనేది తెలుస్తుందని ఆంధ్రా ఆసుపత్రి వైద్యులు రవీంద్రనాథ్‌ తెలిపారు.

ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత..:గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపించింది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించగా, శాశ్వతంగా మూసేయాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. అధికారులు, పోలీసులు ఫ్యాక్టరీ యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఈ సందర్భంగా పోలీసులకు, గ్రామస్థులకు మధ్య గంటల తరబడి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

ఫ్యాక్టరీలో ఏం తయారవుతుందో లోపల పనిచేసే వాళ్లకూ తెలియక పోవడమేంటని స్థానికులు ప్రశ్నించారు. జనాన్ని అదుపు చేసేందుకు సుమారు 350 మంది పోలీసులను ఫ్యాక్టరీ వద్దకు రప్పించారు. పలువురు పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎంపీ కోటగిరి శ్రీధర్‌, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు ఫ్యాక్టరీని సందర్శించారు. ఘటనపై విచారణ కమిటీని నియమిస్తున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు.

పేలుడా.. లీకేజా?.. గ్యాస్‌ లీకేజీ కారణంగా ప్రమాదం జరిగిందా? లేదా పేలుడు జరిగిందా? అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. దీని వెనుక కారణమేంటనే కోణంలో అటు డైరెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ అధికారులు, ఇటు పోలీసులు విచారిస్తున్నారు.

ఫ్యాక్టరీలో 4 ఎంపీఐ అనే ఓ పౌడర్‌ తయారవుతుంది. దానిని మరో ప్రాంతానికి తరలించి అక్కడ పాలిమర్‌ బాల్స్‌ తయారు చేస్తారు. ఇందుకు బాగా మండే స్వభావమున్న మోనోమిథైల్‌ అమైన్‌ అనే గ్యాస్‌ను ఉపయోగిస్తారు. సిబ్బంది తప్పిదం కారణంగా గ్యాస్‌ లీకై.. ఆ వేడికి మంటలు రేగి ప్రమాదం సంభవించిందనేది ఓ వాదన. రెండో ఫ్లోర్‌లోని రియాక్టర్‌ పేలి.. దానివల్ల భారీగా మంటలు చెలరేగాయనే మరో వాదన వినిపిస్తోంది. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా కేసు నమోదు చేసుకున్నారు. ఫ్యాక్టరీలో అయిదు బ్లాక్‌లు ఉండగా ప్రస్తుతం మూడే పనిచేస్తున్నాయి. డీ బ్లాక్‌లోని రెండో ఫ్లోర్‌లో పేలుడు జరిగిందని చెబుతున్నారు. ఆ బ్లాక్‌లో పనిచేస్తున్న వారంతా గాయపడ్డారు. కొందరు గోడ దూకి మంటలతోనే తోటల్లోకి పరుగులు తీశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పై ఫ్లోర్‌లో పనిచేస్తున్న వారిలో అయిదుగురు అక్కడికక్కడే చనిపోయినట్లు తెలుస్తోంది.

విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి:పోరస్‌ ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చనిపోయినవారి కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్ప గాయాలైనవారికి రూ. 2 లక్షల చొప్పున సాయం అందించనున్నట్లు వెల్లడించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా కలెక్టర్‌, ఎస్పీకి సూచించారు. కంపెనీ తరపున మరో రూ.25 లక్షలు మృతుల కుటుంబాలకు ఇచ్చేలా వారితో మాట్లాడినట్లు బాధితులను పరామర్శించిన అనంతరం హోంమంత్రి తానేటి వనిత వెల్లడించారు.

పరిహారం ప్రకటించిన బిహార్‌ సీఎం:అక్కిరెడ్డిగూడెం దుర్ఘటనలో నలుగురు బిహారీలు మృతి చెందడంపై బిహార్‌ ముఖ్యమంత్రి నీతీష్‌ కుమార్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు ఒక్కొక్కరి కుటుంబానికి రూ. రెండు లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.

నేతల పరామర్శ కోసం ఇదేం తీరు?విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: బాధితుల రోదనలు, హాహాకారాలతో విజయవాడ ప్రభుత్వాసుపత్రి హృదయవిదారకంగా మారింది. పోరస్‌ పరిశ్రమలో గాయపడిన మొత్తం 13 మందిలో బి.కిరణ్‌కుమార్‌ అనే వ్యక్తి దారిలో మృతి చెందారు. ఒకరికి స్వల్పంగానే గాయాలవడంతో ప్రథమ చికిత్స చేసి పంపించేశారు. మిగతా 11 మందికి అత్యవసర విభాగంలో వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం వారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తామంటూ పోరస్‌ పరిశ్రమ ప్రతినిధులు సూపరింటెండెంట్‌ సౌభాగ్యలక్ష్మిని కోరగా ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పంపించేది లేదని ఆమె స్పష్టం చేశారు. చివరికి ఉదయం 9 గంటలకు అధికారులు అంగీకరించడంతో పదిమందిని ఉదయం 9.30 గంటలలోపు గొల్లపూడిలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. కానీ.. జోసఫ్‌ అనే బాధితుడిని ఉదయం 11.30 వరకు ఇక్కడే ఉంచేశారు. సుమారు రెండు గంటలపాటు నేతలు పరామర్శించడం కోసమే అతడిని ఇక్కడే ఉంచారంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఇదీ చదవండి:

Last Updated : Apr 15, 2022, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details