ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 9, 2023, 5:07 PM IST

Updated : Apr 10, 2023, 12:16 PM IST

ETV Bharat / state

మంచి ఆదరణ.. లాభాల్లో దూసుకెళ్తున్న 'చేయూత మహిళా మార్ట్'

Cheyutha Mahila Matrs: డ్వాక్రా సంఘాల మహిళలే యజమానులుగా ఏలూరులో ఏర్పాటైన చేయూత మహిళా మార్టులు మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. ఫైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలో మంజూరైన రెండు ప్రాజెక్టుల్లో చింతలపూడి చేయూత మార్టు లాభాలతో దూసుకెళ్తోంది. వివరాల్లోకి వెళ్తే..

mahila mart
mahila mart

లాభాల్లో దూసుకెళ్తున్న చేయూత మహిళా మార్ట్

Cheyutha Mahila Matrs: మహిళల ఆర్థిక స్వయం సమృద్ధి సాధన కోసం.. డ్వాక్రా సంఘాల మహిళలే యజమానులుగా ఏర్పాటైన.. చేయూత మహిళా మార్టులు మంచి ఆదరణ పొందుతున్నాయి. వినియోగదారులకు నాణ్యమైన సరుకులను తక్కువ ధరకే అందించటమే.. ఈ మార్టుల ప్రత్యేకత. ఫైలెట్ ప్రాజెక్టు కింద ఏలూరు జిల్లాలో మంజూరైన రెండు ప్రాజెక్టుల్లో.. చింతలపూడి చేయూత మార్టు లాభాల బాటలో ముందడుగులో ఉంది.

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో.. ఏర్పాటైన మహిళా మార్టులు.. ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే లాభాల బాటలో నడుస్తున్నాయి. డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధితో పాటు వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన సరుకులను అందించాలన్న ఉద్దేశంతో.. చేయూత మహిళా మార్టును ఏర్పాటు చేశారు. జిల్లాలో మొదటగా జంగారెడ్డిగూడెం, చింతలపూడిలో ఈ మార్టులను ప్రారంభించారు. నిత్యావసర సరుకులను చేయూత మార్టుల్లోనే కొనుగోలు చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.

మారుమూల గ్రామాల్లోని వారు సైతం చేయూత మహిళా మార్టుల ద్వారా తక్కువ ధరలకు నిత్యావసర సరుకులను విక్రయిస్తున్నారు. చేయూత మహిళా మార్టులలో నాణ్యమై సరుకులు అందించేదుకు ఎనిమిది ప్రముఖ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోగా.. వీటితో పాటు పొదుపు సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకునే వెసులుబాటు కల్పించారు.

ఇతర సూపర్‌ మార్కెట్లకు దీటుగా చేయూత మార్టులను ఏర్పాటు చేశారని స్థానికులు అంటున్నారు. ఈ మార్టుల నిర్వహణ కోసం 10 మంది సభ్యులతో వారు కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీ మార్టులో సిబ్బందిని నియమించుకుంటుంది. వారికి వచ్చే లాభాల్లో సమాఖ్య సభ్యులకు వాటాను 6 నెలలకు ఓసారి.. డివిడెండ్‌ రూపంలో పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఈ మార్టులో కొనుగోలు చేసే సమాఖ్య సభ్యులకు 3 శాతం రాయితీ కూడా ఇస్తున్నారు. నాణ్యమైన సరుకులను తక్కువ ధరకు విక్రయించేలా ఏర్పాటైన ఈ మహిళా మార్టుల పట్ల.. వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

"ఈ వైయస్సార్ మహిళా మార్ట్​ను మేము మా డ్వాక్రా సంఘాల అమౌంట్​తో సొంతంగా ఏర్పాటు చేసుకున్నాము. ఎవరి మధ్వవర్తిత్వం లేకుండా మా మహిళా సంఘాల ద్వారా ఫస్ట్ క్వాలిటీ సరుకులను కొనుగోలు చేస్తున్నాము. వచ్చిన లాభాలను కూడా మేమే తీసుకుంటున్నాము. ఎమ్మార్పీ కంటే తక్కువ రేటుకే సరుకులు వస్తున్నాయి. ప్రతి రోజు లక్ష రూపాయలకు పైనే మాకు సేల్స్ అవుతున్నాయి." - జ్యోతి వెంకాయమ్మ, డ్వాక్రా సంఘం మహిళ

పైలెట్ ప్రాజెక్టులుగా ఏర్పాటైన చింతలపూడి మహిళా మార్టు.. లాభాల బాటలో నడుస్తుండటంతో.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఇటీవల మరో మహిళా మార్టును ప్రారంభించారు. దీంతోపాటు ఇంకో మార్టును తణుకు పట్టణంలో ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Last Updated : Apr 10, 2023, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details