Chandrababu Visit Nuziveedu Constituency: రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. అవసరమైతే వారిని బాధపెడుతున్న వైకాపాకు ఉరివేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రైతులకు తాను అండగా ఉంటాననీ, ముందున్నవన్నీ మంచి రోజులేననీ భరోసా ఇచ్చారు. ఏలూరు జిల్లా నెక్కలం గొల్లగూడెం గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘వైకాపా పాలనలో ఏ రైతయినా సంతోషంగా ఉన్నాడా? మీరంతా పిరికివారనుకుని రేపో మాపో మోటర్లకు మీటర్లు బిగిస్తామంటున్నారు. మీరు ఊరుకుంటారా? ఉచిత విద్యుత్తునిచ్చింది ఎన్టీఆర్.. దాన్నెలా వదులుతాం? తెలంగాణలో మీటర్లు పెట్టబోమని అక్కడి ముఖ్యమంత్రి చెబుతోంటే జగన్కు మాత్రం ఎందుకంత ఉత్సాహం? మీ వ్యవసాయ కనెక్షన్లకు మోటర్లు పెట్టనిస్తారా? మీ ఊళ్లోకి వాళ్లను రానిస్తారా? గతి లేని రైతులే వరి పంట వేస్తారని ఓ మంత్రి అంటున్నారు. ఆ రైతే వరి పండించకపోతే ఆయన గడ్డి తింటారా? ఆ రోజులూ వస్తాయి. మేం రూ.50 వేల రుణమాఫీˆ ఒకేసారి చేశాం. ఇప్పుడేం చేస్తున్నారు? రూ.7,500 ఏటా ఇస్తూ.. 13,500 ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. పంట సకాలంలో కొనట్లేదు. కొన్నా డబ్బులివ్వడం లేదు. రాయితీపై వ్యవసాయ పరికరాలు ఇవ్వడం లేదు. అయినా మీకు రోషం లేదా?
అరెస్టు చేస్తే ఏమవుద్ది? :అరెస్టు చేస్తే అచ్చెన్నాయుడు హీరో అయ్యాడు. చింతమనేని ప్రభాకర్పై కేసుల మీద కేసులు పెట్టారు. ఎంతమందిపై కేసులు పెడతారు? ఎంతమందిని భయపెడతారు? నేను అనుకుంటే జగన్ అసలు బయటకు వచ్చేవాడా? నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూజివీడుకు నీళ్లు కావాలని ఎన్నో ప్రయత్నాలు చేశా. పట్టిసీమ ఎత్తిపోతల తొమ్మిది నెలల్లో కట్టి కృష్ణా జిల్లాను సస్యశ్యామలం చేశా. చింతలపూడిని మొదలుపెట్టా. వీళ్లొచ్చాక పనులు అటకెక్కాయి. 72 శాతం పూర్తి చేసిచ్చిన పోలవరాన్ని సైతం అవినీతి, రివర్స్ టెండరింగ్ అంటూ.. తాత్సారం చేశారు. పూర్తయిన పనులనూ నాశనం చేశారు. డయాఫ్రం వాల్ ఇసుకలో పూడుకుపోయింది. దాన్ని వెలికితీయాలంటే రూ.800 కోట్లు కావాలని కేంద్రం తాజా నివేదిక ఇస్తే బాధేసింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నింటిపైనా బాదుడే:నదుల అనుసంధానం చేసి రాష్ట్రంలోని ప్రతి ఎకరానికీ నీళ్లిద్దామనుకున్నా.. ప్రస్తుత పరిస్థితి చూస్తే బాధేస్తోందని చంద్రబాబు అన్నారు. ‘రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అన్నింటిపైనా బాదుడే బాదుడు. ఆఖరికి చెత్తపై కూడా పన్ను వేసిన ప్రభుత్వం ఇదే. నేను అధికారం కోసం రాలేదు. రాష్ట్ర పరిస్థితి మీకు చెప్పేందుకే వచ్చా.. ఆలోచించండి. ప్రకాశం జిల్లాలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడని విని చాలా బాధేసింది. మంచి రోజులొస్తాయి. నేను రైతుల బాధ్యత తీసుకుంటా. ఆక్వా రైతులను ఈ ప్రభుత్వం మోసం చేసింది. మేం ఉచితంగా ఇచ్చిన ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు పెట్టుకోవాలంటే వారు రూ.3.5 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది.
సన్నాలు అన్నారు.. ఉన్న బియ్యమూ పోయింది:సన్నబియ్యం అన్నారు. ఇప్పుడు సన్నబియ్యంతో పాటు ఉన్న బియ్యం కూడా పోయిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘కిలో రూ.40 నుంచి రూ.50కి కొనే బియ్యానికి 12 రూపాయలు ఇస్తారట. ఆయన తెలివితేటలు ఎవరికైనా ఉంటాయా? బియ్యం తీసుకోవట్లేదనే సాకుతో రేపు రేషన్కార్డు తీసేస్తారు. ఆ తరువాత.. ఉపకారవేతనాలు, పింఛన్లు ఏవీ రావు. జగన్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు. రూ.7 లక్షల కోట్ల అప్పులున్నాయి. ఇవన్నీ ఎవరు తీర్చాలి? శ్రీలంక పరిస్థితి ఏమైంది? దివాలా తీసింది. తండ్రి హయాంలోనే రూ.40 వేల కోట్ల దోపిడీ చేస్తే ఇప్పుడెంత చేస్తారు? పేదలకిచ్చే ప్రతి రూపాయిలోనూ 20 పైసలు పేదలకైతే.. 80 పైసలు వైకాపా నాయకులకే’ అని ఆరోపించారు.
మళ్లీ మీరొస్తేనే రాష్ట్రం సుభిక్షం: మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రం గాడిన పడుతుందని, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుందని నెక్కలంగొల్లగూడెం గ్రామస్థులు పేర్కొన్నారు. బుధవారం రాత్రి ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామంలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో వారు మాట్లాడారు. కొందరు తమ సమస్యలను ఆయనకు ఏకరువు పెట్టగా, బాబు హయాంలో జరిగిన అభివృద్ధి గురించి, తాము పొందిన లబ్ధి గురించి మరికొందరు గుర్తు చేసుకున్నారు. వారు వ్యక్తచేసిన అభిప్రాయాలివి..