AP MLC Sheikh Sabji Funerals: తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి పార్థివ దేహాన్ని ఏలూరు కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఇండోర్ స్టేడియంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ ఏలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బడేటి చంటి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజా సంఘాల నాయకులు, వందలాది మంది ఎమ్మెల్సీ పార్థివదేహాన్ని సందర్శించి కన్నీటి పర్యంతమయ్యారు.
షేక్ సాబ్జి సన్నిహితులు అతని ఉద్యమ పోరాటాలు, చేసిన కృషిని గుర్తు చేసుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షకుల సమస్య పరిష్కారం కోసం అనేక ఉద్యమాల్లో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి భాగస్వామ్యం అయ్యారని, ఆయన మృతి ఉద్యమాలకు తీరని లోటు అని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
పాల తూము స్మశాన వాటికలో అంత్యక్రియలు: మధ్యాహ్నం కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి సత్రంపాడులో ఉన్న ఆయన ఇంటి వద్దకు తీసుకొని వెళ్లనున్నారు. సత్రంపాడులోని షేక్ సాబ్జి ఇంటి వద్ద నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అవుతుందని, శాంతి నగర్, సీఆర్ఆర్ కాలేజ్, కొత్త బస్టాండు, ఓవర్ బ్రిడ్జి, జ్యూట్ మిల్ వంతెన మీదుగా సాగనుంది. అదే విధంగా పంపుల చెరువు నుంచి వంగాయగూడెం మీదుగా సాగిన అనంతరం పాల తూము సెంటర్ వద్ద ఉన్న స్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.