ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 22, 2023, 11:59 AM IST

ETV Bharat / state

మితిమీరిన అధికార పార్టీ ఆగడాలు.. మహిళలపై సర్పంచ్ దాడి

Sarpanch attack on women: ఓ కరెంటు స్తంభం ఏర్పాటు విషయంలో వైసీపీకి చెందిన గ్రామ సర్పంచ్ తమ పార్టీ నాయకులతో కలిసి ఓ కుటుంబంపై దౌర్జన్యానికి దిగి దాడి చేశారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?..

pedaparthi president attacked a family
కరెంటు స్తంభం విషయంలో ఓ కుటుంబంపై వైసీపీ నేతల దాడి

Sarpanch attack on women: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తి గ్రామంలో ఓ కరెంటు స్తంభం విషయంలో వైసీపీకి చెందిన గ్రామ సర్పంచ్ నల్లమిల్లి కాంతమ్మ తమ పార్టీ నాయకులతో కలిసి ఓ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. అనపర్తి మండలం పెడపర్తి గ్రామం దేవుడు కాలనీలో సుగల రాజబాబు కొన్ని ఏళ్లుగా నివాసం ఉంటున్నాడు. అయితే అతని ఇంటి ఆవరణలో గత కొన్ని ఏళ్లుగా ఒక కరెంటు స్తంభం ఉంది.

ఆ స్తంభం తీయించాలంటూ స్థానిక ప్రజా ప్రతినిధులను, అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా ఎవరు స్పందించకపోవడంతో స్పందనలో గత ఏడాది అక్టోబర్​లో రెండు సార్లు ఫిర్యాదు చేశాడు. దీంతో స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు.. స్తంభం తొలగించేందుకు రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దీంతో అతడు గత ఏడాది నవంబర్​లో విద్యుత్ శాఖకు దరఖాస్తు చేసుకోవడంతో పాటు డీడీ రూపంలో రుసుమును చెల్లించాడు.

దీనిలో భాగంగానే గత ఏడాది డిసెంబర్​లో కరెంటు స్తంభం తీసి బయట వేసినప్పటికీ విద్యుత్ అధికారులు కరెంటు వైర్లు మాత్రం మార్చలేదు. కాగా.. మంగళవారం ఉదయం విద్యుత్ శాఖ అధికారులు వచ్చి కరెంటు వైర్లు మార్చి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా.. గ్రామ సర్పంచ్ నల్లమిల్లి కాంతమ్మ వైసీపీ నాయకులు తమ అనుచరులతో వచ్చి ఎవరిని అడిగి కరెంట్ స్తంభం మార్పించారంటూ రాజబాబు కుటుంబ సభ్యులపై దౌర్జన్యానికి దిగారు.

తీసివేసిన స్తంభాన్ని తిరిగి రాజబాబు ఇంటి ఆవరణలో వేయించేందుకు సర్పంచ్, తన అనుచరులు ప్రయత్నిస్తుండగా.. రాజబాబు కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ నాయకురాలు, గ్రామ సర్పంచ్ నల్లమిల్లి కాంతమ్మ ఆమె అనుచరులు రాజబాబు కుటుంబ సభ్యులపై దుర్భాషలాడుతూ దాడికి దిగారు. రాజుబాబు కుటుంబ సభ్యులను గ్రామ సర్పంచ్ కాంతమ్మ, వైసీపీ నాయకులు దుర్భాషలాడటమే కాకుండా తమను ఇష్టమొచ్చినట్లు చేతులతో కాళ్లతో కొట్టారని బాధితులు ఆరోపించారు.

బాధితులు.. తమపై జరిగే దాడి ఘటనను వీడియో తీస్తుండగా వారి ఫోన్లను సైతం సర్పంచి అనుచరులు లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సుగల రాజబాబు కుటుంబ సభ్యులే తమపై దాడి చేశారంటూ గ్రామ సర్పంచ్ నల్లమిల్లి కాంతమ్మ అనపర్తి ఏరియా ఆసుపత్రిలో చేరి పోలీసులకు ఫిర్యాదు చేసారు. సుగుల రాజబాబు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసేందుకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు పోలీసు స్టేషన్​కు వెళ్లారు.

అయితే రాత్రి 8 గంటల వరకు వారిని పోలీస్ స్టేషన్ లోనే ఉండటంతో.. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్​కు వెళ్లారు. రాత్రి 8 గంటల వరకు ఫిర్యాదు ఎందుకు తీసుకోలేదని అంటూ ఎస్సైపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ, డీఎస్పీలతో ఫోన్లో మాట్లాడారు. రెండు వర్గాలని పోలీస్ స్టేషన్లో ఉంచానని చెప్పిన ఎస్సై బాధితులను మాత్రమే పోలీస్ స్టేషన్​లో ఉంచారని గ్రామ సర్పంచ్ వర్గాన్ని మాత్రం స్టేషన్లో ఉంచకుండా ఇంటికి పంపించివేశారని తెలిపారు.

మధ్యాహ్నం 3 గంటలకు పోలీస్ స్టేషన్​కు వచ్చిన వారిని 5 గంటల పాటు ఉంచి వారి ఫిర్యాదును ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. గాయాల పాలైన బాధితులను ఆసుపత్రికి తీసుకుని వెళ్లకుండా పోలీస్ స్టేషన్లో ఉంచడం ఏంటని ఎస్సైపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్సైకి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో బాధితులతో కలిసి ఆయన బయట నుంచి ఆందోళనకు దిగారు. అనంతరం బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న ఎస్ఐ రెండు వర్గాల నుంచి ఫిర్యాదులు తీసుకున్నామని విచారించి చర్యలు చేపడతామని తెలిపారు.

" మా ఇంటి ముందు ఉన్న స్తంభాన్ని మేము తీయించినందుకు మా గ్రామ ప్రెసిడెంట్ మా దగ్గరకు వచ్చారు. మేము తీసేసిన స్తంభాన్ని మళ్లీ తీసేసిన దగ్గరే వేసేందుకు ప్రయత్నించారు. అందుకు మేము అంగీకరించక అడ్డుపడ్డాము. దీంతో వారు మాపై దారుణంగా దాడికి పాల్పడ్డారు." - సుగల వీరలక్ష్మి, బాధితురాలు

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details