ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంచాయతీ ఎన్నికల బరిలో మహిళలు

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు మొదటిదశ ప్రక్రయ నేటితో ముగిసింది. చాలాచోట్ల మహిళా అభ్యర్థులు సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లను దాఖలు చేశారు. ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రెండో దశ నామినేష్లనూ.. ప్రారంభమవగా చాలామంది వనితలు నామపత్రాలు దాఖలు చేశారు. మూడు, నాలుగో దశల్లోనూ పోటీ చేసేందుకు వీరు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు.. 50 శాతానికిపైగా రిజర్వేషన్లు కేటాయించారు.

By

Published : Feb 4, 2021, 5:11 PM IST

Women contesting panchayat elections in East Godavari district
పంచాయతీ ఎన్నికల బరిలో మహిళలు

ఇంటికి దీపం ఇల్లాలు అంటారు.. వారితోనే కుటుంబాల పురోగతి ఆధారపడి ఉంటుంది.. చైతన్యవంతమైన మహిళ కుటుంబ సభ్యులను ప్రగతి దిశగా నడిపిస్తుంది.. మరి ఆమె పాలనా పగ్గాలు చేపడితే.. అభివృద్ధికి దశా.. దిశా నిర్దేశిస్తుంది.. అలాంటి అవకాశం మరలా వచ్చింది.. తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతానికిపైగా రిజర్వేషన్లు కేటాయించారు. సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాలకు వీరికి అగ్రపీఠం వేశారు.. కేటాయించిన స్థానాల్లో ఇప్పటికే మొదటి దశలో నామపత్రాలు దాఖలు చేయగా, రెండో విడతలో ఆ ప్రక్రియ కొనసాగుతోంది. మూడు, నాలుగో దశల్లోనూ వీరు పోటీలో నిలువనున్నారు.

ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి..

పెద్దాపురం మండలం చదలాడ గ్రామం నుంచి వరుసగా మూడుసార్లు గ్రామ సర్పంచిగా రాగాల మాణిక్యాంబ ఎన్నికయ్యారు. 2001, 2006లో ఏకగ్రీవంగా, 2013లో పోటీచేసి విజయం సాధించారు. ప్రజల సహకారంతో సంపూర్ణ పారిశుద్ధ్యం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారు. 2010లో నిర్మల్‌ పురస్కార్‌ అవార్డును, 2012-13లో జిల్లాస్థాయిలో స్వచ్ఛభారత్‌ అవార్డు సాధించారు. 2017-18లో స్వచ్ఛభారత్‌లో జాతీయ స్థాయిలో ఈ గ్రామం తొమ్మిదో స్థానం పొందింది. 2018లో జిల్లాలో ఉత్తమ పంచాయతీ అవార్డు సాధించింది. జన్మభూమి పథకం, ప్రజల భాగస్వామ్యంతో రహదారులు, ఇతర సౌకర్యాలు కల్పించారు. ఇరువై ఏళ్లు పదవీ కాలంలో సుమారు రూ. ఆరు కోట్లతో గ్రామాభివృద్ధి సాధించారు.

పంచాయతీ ఎన్నికల బరిలో మహిళలు

రెండు పర్యాయాల నుంచి 50 శాతం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను 2006 నుంచి అమలు చేస్తున్నారు. 2006, 2013 ఎన్నికల్లో జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. 2006 సంవత్సరానికి ముందు మహిళలకు స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఉండేవి. మళ్లీ ఇప్పుడు 50 శాతంతో నిర్వహిస్తున్నారు. 2013 ఎన్నికల్లో 880 పంచాయతీల్లో 50 శాతం మహిళా సర్పంచులే ఏలారు. ఇప్పుడు మళ్లీ అలాంటి అవకాశం వచ్చింది.మేజరు పంచాయతీల్లో సత్తా.. జిల్లాలో 225 మేజర్‌ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఇప్పుడు జరిగే ఎన్నికల్లో చాలాచోట్ల సర్పంచి స్థానాలను మహిళలకు కేటాయించారు. రూ.కోటికి పైగా ఆదాయమున్న పంచాయతీల్లో మహిళల చేతికి పగ్గాలు రానున్నాయి. కొత్తపేట, రావులపాలెం, ద్వారపూడి, గాడిమొగ, తాళ్లరేవు, కోరంగి, పల్లంకుర్రు, కందికుప్ప, బిక్కవోలు, అనపర్తి, ఇలా మేజరు పంచాయతీల్లో సైతం వనితలు సత్తా చాటనున్నారు. మేజరు పంచాయతీల్లో 50 శాతం వరకూ సర్పంచి స్థానాలు వారికి రిజర్వు అయ్యాయి. పోటీలో నిలవడం నుంచి గెలిచి పాలన పగ్గాలు చేపట్టి.. ఆయా పంచాయతీల ప్రగతిలో వీరు కీలక పాత్ర పోషించాలి.

అభివృద్ధే గీటురాయిగా..

అవకాశం కల్పించి.. అందలం ఎక్కిస్తే మహిళలు గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని కాకినాడ గ్రామీణ మండలం తిమ్మాపురం గ్రామ మాజీ సర్పంచి కర్రి ఆదిలక్ష్మి నిరూపించారు. గృహిణిగా ఉన్న ఆదిలక్ష్మి సర్పంచిగా పోటీచేసి 1997 నుంచి 2002 వరకు అధికారంలో కొనసాగారు. ప్రజా అంచనాలతో గ్రామంలో రహదారులు, మురుగు కాలువలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారు. అప్పటి కలెక్టర్‌ జేఎస్‌వీ ప్రసాద్‌ నుంచి 1998, 1999 సంవత్సరాలకు జిల్లా ఉత్తమ పంచాయతీ అవార్డు, 2000, 2001, 2002 సంవత్సరాలకు ఉత్తమ సర్పంచి పురస్కారాలు అందుకున్నారు.

అక్కడంతా అతివలే...

గాడిలంక గ్రామ పంచాయతీ కార్యాలయం..

ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామ పంచాయతీకి గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామస్థులంతా ఒకతాటిపైకి వచ్చి పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందులోని వారంతా మహిళలే కావడం విశేషం. 2,765 మంది జనాభా ఉండే ఈ పల్లెలో అన్ని రాజకీయ పార్టీల నాయకులూ చర్చించుకుని సర్పంచి దగ్గర నుంచి వార్డు సభ్యుల వరకు మహిళలకే పగ్గాలు అప్పగించారు. సర్పంచి కాశి దాదామణితో పాటు 10 మంది మహిళా వార్డు సభ్యులు గ్రామ అభివృద్ధిలో తమవంతు పాత్ర పోషించారు. గ్రామంలో సిమెంటు రహదార్లు, మురుగుకాలువల నిర్మాణం చేశారు. 14వ ఆర్థిక సంఘం, పంచాయతీ సాధారణ నిధులు, జడ్పీ, ఎస్‌డీఎఫ్, సీఎస్‌ఆర్‌ నిధులతో పనులు చేసి ప్రత్యేకత చాటుకున్నారు.

పంచాయతీ ఎన్నికల బరిలో మహిళలు

స్థానికం నుంచి చట్టసభల వరకు..

జిల్లాలో పలువురు మహిళలు సర్పంచి స్థాయి నుంచి ఎంపీ, ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వారున్నారు. మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి సర్పంచిగా ప్రస్థానం ప్రారంభించారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి తొలుత సర్పంచిగా పనిచేశారు. తరువాత శాసన సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ప్రస్తుత కాకినాడ పార్లమెంట్‌ సభ్యురాలు వంగా గీత కొత్తపేట జడ్పీటీసీ సభ్యురాలిగా పనిచేశారు. ఒకసారి రాజ్యసభ సభ్యురాలిగా, మరోసారి ఎమ్మెల్యేగా, ఇప్పుడు పార్లమెంట్‌ సభ్యురాలిగా, జడ్పీ ఛైర్మన్‌గా పనిచేశారు. పిల్లి అనంతలక్ష్మి సామర్లకోట జడ్పీటీసీ సభ్యురాలిగా రాజకీయ అరంగేట్రం చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పర్వత బాపనమ్మ శంఖవరం ఎంపీపీగా పనిచేశారు. తరువాత ప్రత్తిపాడు శాసన సభ్యురాలిగా సేవలు అందించారు.

పంచాయతీ ఎన్నికల బరిలో మహిళలు
పంచాయతీ ఎన్నికల బరిలో మహిళలు
పంచాయతీ ఎన్నికల బరిలో మహిళలు

ఇదీ చదవండి:

పంచాయతీ ఎన్నికల్లో వినూత్న ప్రచారాలు

ABOUT THE AUTHOR

...view details