ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఉప ప్రణాళిక ప్రాంతంలో ఎవరిని కదిలించినా.. వినిపించే ఆవేదన ఇదే. గుర్తింపు కోసం 40 ఏళ్లుగా సాగిస్తున్న పోరాటాన్ని కొందరు నీరుగార్చారని నిర్వేదంతో చెబుతున్నారు. మోసపూరితంగా కొందరు చేసిన పని.. తమతో పాటు భవిష్యత్ తరాల ఆశల్ని ఆవిరి చేసేలా ఉందని ఆందోళన బాటపట్టారు.
శంకవరం, రౌతులపూడి, ప్రత్తిపాడు మండలాల్లో కొంత ఉప ప్రణాళిక ప్రాంతం ఉంది. కొండలు, గుట్టలతో ఉన్న ఈ ప్రాంతంలో గిరిజన ఆవాసాలున్నాయి. అరకొర సౌకర్యాలతో అభివృద్ధి మచ్చుకైనా కనిపించదు ఈ ప్రాంతంలో. దెబ్బతిన్న రహదారుల్లోనే నిత్యం నరక ప్రయాణాలు సాగిస్తున్నారు. కుల ధ్రువీకరణ పత్రాల మంజూరుకు ఆందోళనలు చేసిన చరిత్ర వీరిది. చదువుకున్న యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లోనూ తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. తమను షెడ్యూల్డ్ ప్రాంతంలో చేర్చాలని ఈ ప్రాంత గిరిజనులు 1985 నుంచి పోరాడుతున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చేసరికి.. ఆ అవకాశాన్ని కొందరు తమకు కాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మూడు మండలాల్లోని 40 ఉప ప్రణాళిక ప్రాంత గ్రామాలను షెడ్యూల్డ్ ప్రాంతంలో కలిపే అంశంపై ప్రజాభిప్రాయం సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు గత నవంబర్ 21న రంపచోడవరం ఐటీడీఏ పీవో.... పెద్దాపురం ఆర్డీవోకు ప్రతిపాదనలు పంపారు. స్థానిక సిబ్బంది మాత్రం.. అక్కడి వారికి కనీస సమాచారం ఇవ్వకుండా.. సొంతంగా తీర్మానాలు చేసేశారు. ఇవి తమ అభీష్టానికి వ్యతిరేకమంటూ గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.