ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 10, 2020, 1:22 PM IST

ETV Bharat / state

అధికారుల కొరతతో ప్రజాపంపిణీకి అవస్థ

అధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే చౌకబియ్యం పక్కదారి పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో చౌక దుకాణాలను పర్యవేక్షించే వారు లేరు. దీంతో ప్రజలకు సరుకులు సజావుగా అందటం లేదు. ప్రభుత్వం త్వరగా అధికారుల కొరతను భర్తీ చేయాలని రెవెన్యూ శాఖ వారు కోరుతున్నారు.

public distribution system
అధికారుల కొరత

కాకినాడ డివిజన్‌కు రెండు ఏఎస్‌వో పోస్టులకు ఒక్క అధికారీ లేరు. అమలాపురం ఏఎస్‌వోకు కాకినాడ డివిజన్‌ బాధ్యతలు అప్పగించారు. 16 మండలాలున్న కోనసీమలో మూడు, నాలుగు మండలాలకు ఒక ఎంఎస్‌వో మాత్రమే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మెట్ట ప్రాంతంలో రెండేసి మండలాలకు ఒక ఎంఎస్‌వో చొప్పున ఉన్నారు. ఇదీ పౌర సరఫరాల శాఖలో పరిస్థితి. క్షేత్రస్థాయిలో చౌక దుకాణాలను పర్యవేక్షించే అధికారులు కొరతతో రేషన్‌ సరకులు పంపిణీ సజావుగా సాగడంలేదు. దీంతో ప్రతి నెలా రెండు లక్షల కుటుంబాల వరకు జిల్లాలో రేషన్‌ సరకులు అందుకోలేని పరిస్థితి.

ప్రజా పంపిణీ వ్యవస్థ పర్యవేక్షణకు అధికారుల కొరత వేధిస్తోంది. జిల్లాలో ఏడు రెవెన్యూ డివిజన్లకు 9 మంది సహాయ సరఫరా అధికారులకు (ఏఎస్‌వో) ముగ్గురు మాత్రమే ఉన్నారు. మండల సరఫరా అధికారులు(ఎంఎస్‌వో) 64 మండలాలకు గాను సగంమంది మాత్రమే ఉన్నారు.

పోస్టులు భర్తీకాక...
జిల్లాకు తొమ్మిది ఏఎస్‌వో పోస్టులు మంజూరవగా.. ఒక పోస్టును పౌర సరఫరాల శాఖ కమిషనరేట్‌లో వినియోగిస్తున్నారు. మిగిలిన ఎనిమిది మందిలో అమలాపురం, రాజమహేంద్రవరం గ్రామీణం, పెద్దాపురం డివిజన్లకు మాత్రమే ఉన్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో సూపరింటెండెంట్‌ పోస్టులో ఒక ఏఎస్‌వో ఉండాలి. ఇది ఏళ్ల తరబడి ఖాళీగా ఉంది.

*జిల్లాలో 64 మండలాలకు 40 మంది ఎంఎస్‌వోలను కేటాయించారు. వీరిలో ముగ్గురు దీర్ఘకాలిక సెలవులో ఉండగా, ఐదు పోస్టులు ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్నాయి. ఇద్దరు ఎంఎస్‌వోల్లో ఒకరు కలెక్టరేట్‌లో, ఒకరు కలెక్టర్‌ సీసీగా వ్యవహరిస్తున్నారు. దీంతో 30 మంది ఎంఎస్‌వోలు మాత్రమే అందుబాటులో ఉన్నారు.

ఇవీ సమస్యలు...
అధికారుల పర్యవేక్షణ లేక చౌకబియ్యం పక్కదారి పడుతున్నాయి. కొందరు డీలర్లు రేషన్‌ బియ్యాన్ని పెద్దమొత్తంలో సేకరించి, మధ్యవర్తుల ద్వారా రైస్‌ మిల్లులకు తరలిస్తున్నారు. కాకినాడ డివిజన్‌లో ఈ విధంగా అక్రమాలకు పాల్పడిన తొమ్మిది మంది డీలర్లను జేసీ ఇటీవల సస్పెండ్‌ చేశారు.

●మండలస్థాయి సరకుల నిల్వ కేంద్రాలు(ఎంఎల్‌ఎస్‌లు) 19 ఉన్నాయి. వీటి నుంచి సరకులను తరలించాలి. అధికారుల పర్యవేక్షణ లేమితో ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచే చౌక బియ్యం తరలిపోతున్నాయి.

●జిల్లాలో పది శాతం రేషన్‌ దుకాణాలు ఇన్‌ఛార్జులే నడిపిస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన దుకాణాలపై 6ఏ కేసులు నమోదు చేస్తున్న తరుణంలో వీటిని త్వరగా పరిష్కరించడానికి అవసరమైన యంత్రాంగం లేక దస్త్రాలు డీఎస్‌వో కార్యాలయంలో మూలుగుతున్నాయి.

●కొవిడ్‌ కారణంగా 12 మంది డీలర్లు బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఈ దుకాణల్లో లబ్ధిదారులు పోర్టబులిటీలో సరకులు పొందడానికి ఏర్పాట్లు చేయని పరిస్థితి నెలకొంది.

పోస్టుల భర్తీకి ప్రభుత్వాన్ని కోరాం

జిల్లాలో పౌరసరఫరాల శాఖలో పూర్తిస్థాయిలో అధికారుల నియామకానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరాం. పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులకు ఇక్కడి పరిస్థితి వివరించాం. ఏఎస్‌వో పోస్టులు ఎక్కువగా ఖాళీలున్నాయి. ఈ శాఖలో ఉద్యోగోన్నతులు కల్పించి, భర్తీ చేస్తామని చెప్పారు. ఎంఎస్‌వో పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఉన్న అధికారులతో పటిష్టంగా రేషన్‌ సరకుల పంపిణీ చేపడుతున్నాం. - లక్ష్మీశ. సంయుక్త కలెక్టర్‌(రెవెన్యూ)

ఇదీ చదవండీ...దేశంలోనే ప్రత్యేకత చాటుకుంటున్న నాగినాయని చెరువు తండా

ABOUT THE AUTHOR

...view details