ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 12, 2020, 2:55 PM IST

Updated : Aug 13, 2020, 6:32 AM IST

ETV Bharat / state

శిరోముండనం కేసు.. తీవ్రంగా పరిగణించిన రాష్ట్రపతి కార్యాలయం

president of india response on Tonsure her head case
శిరోముండనం కేసు.. తీవ్రంగా పరిగణించిన రాష్ట్రపతి కార్యాలయం

14:52 August 12

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం కేసుపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. తనకు జరిగిన అన్యాయంపై ఇటీవలే బాధితుడు ప్రసాద్ రాష్ట్రపతికి లేఖ రాశారు. బాధ్యులపై సత్వర చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి రాష్ట్రపతి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నట్టు రాష్ట్రపతి కార్యాలయానికి ఏపీ ప్రభుత్వం సమాధానం పంపింది.

బాధితుడు లేఖ పంపిన వివరాలు

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో తనకు శిరోముండనం చేసిన వ్యవహారంపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించినట్లు బాధితుడు ఇండుగుమిల్లి ప్రసాద్‌ తెలిపారు. ‘‘ఇసుక మాఫియాను ఎదురించినందుకు నాకు పోలీసుస్టేషన్‌లోనే శిరోముండనం చేశారు. ఇందుకు కారకులైన ముఖ్య వ్యక్తులను అరెస్టు చేయకపోవడంతో నేను మానసికంగా ఆవేదన చెందుతున్నాను. నక్సలైట్‌గా మారేందుకు అనుమతిస్తే నా గౌరవాన్ని రక్షించుకుంటా’’ అని పేర్కొంటూ ఇటీవల రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌కు వెబ్‌సైట్‌ ద్వారా బాధితుడు ప్రసాద్‌ లేఖ పంపిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం సంబంధిత దస్త్రాన్ని ఏపీకి చెందిన సాధారణ పరిపాలన విభాగానికి బదిలీ చేసిందని, సహాయకార్యదర్శి జనార్దన్‌బాబుకు బాధ్యతను అప్పగించిందని, ఈ కేసు విషయంలో ఆయనకు సహకరించాలని సూచించిందని బాధితుడు ప్రసాద్‌ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం వల్ల న్యాయం జరగకపోవడం వల్లనే లేఖ పంపించాను. తక్షణం రాష్ట్రపతి స్పందించడంతో నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. సహాయకార్యదర్శి జనార్దన్‌బాబు గురువారం మునికూడలి వచ్చి నా దగ్గర నుంచి అవసరమైన వివరాలు తీసుకుంటారని వెలగపూడి కార్యాలయం నుంచి నాకు సమాచారం వచ్చింది. రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలకు కొద్ది గంటల ముందే అట్రాసిటీ కేసులో భాగంగా రూ.50 వేల పరిహారాన్ని రెవెన్యూ అధికారులు హడావుడిగా వచ్చి అందించారు’ అని వివరించారు.

వైకాపా నేత కవల కృష్ణమూర్తి అతని అనుచరులు శిరోముండనం చేయించేలా పోలీసులను ప్రోత్సహించారని బాధితుడు ఆరోపించారు. ఈ కేసులో అన్ని చర్యలూ తీసుకున్నామని ఏలూరు రేంజి డీఐజీ చెప్పడం సరికాదన్నారు. అసలు నిందితులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తనను తప్పుదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనడం డీఐజీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్‌ మాట్లాడుతూ ఏ1 నుంచి ఏ6 వరకు ముద్దాయిలను వదిలేసి కొత్తగా విధుల్లో చేరిన పోలీసులపై చర్యలు తీసుకుని న్యాయం చేశామనడం సరికాదని చెప్పారు. రాష్ట్రపతి కార్యాలయం ప్రసాద్‌ వినతిపై తక్షణం స్పందించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ప్రసాద్‌కు న్యాయం జరగాలి: వర్ల రామయ్య

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న ఆటవిక పాలనలో తమకు న్యాయం జరగదనే ఆలోచనతో యువత తీవ్రవాదం వైపు అడుగులేస్తోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేర్కొన్నారు. శిరోముండనం బాధితుడు ప్రసాద్‌కి ఇప్పటికీ న్యాయం జరగలేదని పేర్కొంటూ జాతీయ ఎస్సీ కమిషన్‌కు బుధవారం ఆయన లేఖ రాశారు. ‘ప్రభుత్వం ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు కానిస్టేబుళ్లను, ఒక ఎస్‌ఐని సస్పెండ్‌ చేసి వారిని అరెస్టు చేసింది. దీని సూత్రధారుల మీద మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. తనకు న్యాయం జరిగేలా లేదని ప్రసాద్‌ నక్సలైట్లలో చేరేందుకు అనుమతివ్వాలంటూ రాష్ట్రపతికి లేఖ కూడా రాశారు. వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి’’ అని ఆ లేఖలో వర్ల కోరారు.

నక్సలైట్లలో చేరాలనుకుంటే చేరవచ్చు కదా: మంత్రి విశ్వరూప్‌

నక్సలైట్లలో చేరాలంటే ఎవరైనా వెళ్లి చేరవచ్చని మంత్రి పినిపె విశ్వరూప్‌ అన్నారు. బుధవారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘నక్సలైట్లలో చేరతా అనుమతించండంటూ ప్రసాద్‌ రాష్ట్రపతికి లేఖ రాశారట. దీనికి రాష్ట్రపతి అనుమతి అవసరం లేదు. వెళ్లి చేరవచ్చు కదా. నక్సలైట్‌ అని ముద్రపడిన తర్వాత చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు’ అని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండీ...'తెలంగాణకు అడ్డు చెప్పరు... మమ్మల్నెలా వద్దంటారు?'

Last Updated : Aug 13, 2020, 6:32 AM IST

ABOUT THE AUTHOR

...view details