ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నేటి నుంచి ఆన్‌లైన్‌ బోధన - online classes news

ఏటా వేసవి సెలవుల అనంతరం జూన్‌ 12న పాఠశాలలు పునః ప్రారంభమవుతుంటాయి. కరోనా ఉద్ధృతి వేళ ఈ ఏడాది కూడా బడులు తెరుచుకోకున్నా బోధన మాత్రం నేటి నుంచి మొదలవుతోంది. 1 నుంచి 10 వరకు అన్ని తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్లో తరగతులు జరుగుతాయని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణలో గతేడాది తూర్పుగోదావరి జిల్లాలో తలెత్తిన ఇబ్బందులు, ప్రస్తుతం వాటిని సవరించుకోవడానికి ఉన్న అవకాశాలు వంటివి ఒక్కసారి పరిశీలిస్తే...

Online classes
ఆన్‌లైన్‌ తరగతులు

By

Published : Jun 12, 2021, 1:46 PM IST

కరోనా కారణంగా దెబ్బతిన్న వాటిల్లో విద్యారంగం ఒకటి. ప్రపంచవ్యాప్తంగా విద్యాసంస్థలు ఆశ్రయిస్తున్న ఏకైక మార్గం ఆన్‌లైన్‌ బోధన. గతేడాదే ఈ విధానానికి నాంది పలికినా తరగతులు పూర్తిస్థాయిలో సాగలేదు. గ్రామాల్లో విద్యార్థులకు అంతర్జాల సౌకర్యం లేకపోవడం, సిగ్నల్‌ సమస్యలు, విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు ఇలా పలు సమస్యలతో తరగతి గదుల్లో మాదిరి పాఠాలు వినలేకపోయారు.

మనం ఏం చేశామంటే...

ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదోతరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ అందుబాటులో ఉన్న సాంకేతిక అంశాలు, వనరులు(అంతర్జాలంతో కూడిన స్మార్ట్‌ టీవీ, చరవాణి, కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌) వివరాలు తెలుసుకునేందుకు రాష్ట్ర విద్యాశాఖ గూగుల్‌ ఫామ్‌ ద్వారా అభిప్రాయాలు సేకరించారు. తూర్పుగోదావరి జిల్లాలోని విద్యార్థుల నుంచి పై వివరాలతో కూడిన సమాచారాన్ని తెలుసుకున్నారు. గతంలో పడిన అవస్థలను అధిగమించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఆమ్మఒడి పథకంలో 8, 9, 10, ఇంటర్‌ తరగతుల్లో కావాల్సిన వారికి ల్యాప్‌టాప్‌లు ఇవ్వడానికి నిర్ణయించారు. అన్ని గ్రామాల్లోనూ ఫైబర్‌ నెట్‌ను ఉచితంగా అందించాలని భావిస్తున్నారు. దాతల సహకారంతో అవసరమైన విద్యార్థులకు ఆండ్రాయిడ్‌ చరవాణులు, ట్యాబ్‌లు కానీ అందించాలనే యోచన చేస్తున్నారు.

ఈ రాష్ట్రాలు స్ఫూర్తిబాట...

కేరళ: కరోనాతో కేరళలో బడులు నడవడం కష్టమైంది. అది గుర్తించిన ప్రభుత్వం విద్యార్థులందరికీ గత ఏడాది ట్యాబ్‌లు అందజేసి పాఠాలు బోధించింది. ఇందుకు దాతల సహకారం తీసుకుంది. పంపిణీ చేసిన ట్యాబ్‌పై విద్యార్థికి సంపూర్ణ అవగాహన కల్పించి, దాని ద్వారా ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పారు.

మహారాష్ట్ర: ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు సర్కారు తరఫున ఇంటర్నెట్‌ కోసం రూ.500 అందివ్వాలని తాజాగా నిర్ణయించింది. ఇంటర్నెట్‌ బిల్లులు కట్టలేక చదువుకు దూరమవుతున్న సుమారు 40 వేలమంది పేద, మధ్యతరగతి పిల్లల కోసం ఈ పథకం తెచ్చింది.

సర్వే ఏం చెప్పిందంటే...

లండన్‌ కేంద్రంగా పనిచేసే క్యూఎస్‌ గేజ్‌ అనే సంస్థ దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో పలు నగరాలు, పట్టణాల్లో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై సర్వే జరిపింది. బ్రాడ్‌బాండ్‌ను ఉపయోగించిన విద్యార్థుల్లో 3 శాతం మంది కేబుల్‌ కోత సమస్యలు, 53 శాతం మంది పూర్‌ కనెక్టివిటీ, 11.47 శాతం మంది విద్యుత్తు సమస్యలు, 32 శాతం సిగ్నల్‌ సమస్యలు ఎదుర్కొంటున్నారని తేల్చింది. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్జాల, మొబైల్‌ హాట్‌స్పాట్‌ కనెక్షన్లు లేనివారు 40.18 శాతం, 3.19 శాతం విద్యుత్తు సమస్యలు, 56.63 శాతం సిగ్నల్‌ సమస్యలు ఎదుర్కొంటున్నారని తేల్చింది.

53 శాతం మందికే వనరులు:

జిల్లాలో ఒకటి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న వారిలో మే నెలాఖరుకు పాఠశాలలు, కళాళాలల్లో నమోదైన 7,46,774 మంది విద్యార్థుల్లో 3,95,897 మంది మాత్రమే సాంకేతిక సదుపాయం అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలలకు దూరమయ్యారు. పలు ప్రైవేటు పాఠశాలల వారు తమ విద్యార్థులకు ఇప్పటికే ఆన్‌లైన్‌ తరగతులు మొదలు పెట్టేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాఠాలకు దూరం కాకూడదని ప్రభుత్వం సాంకేతిక వనరులకు సంబంధించి సర్వే చేపట్టింది. జిల్లాలో మొత్తం 53 శాతం మంది విద్యార్థులే పూర్తి వనరులు కలిగి ఉన్నారని గుర్తించారు.

అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం:

ఆన్‌లైన్‌ తరగతులకు అకడమిక్‌ క్యాలెండర్‌, ప్రణాళికను రూపొందిస్తున్నాం. ప్రతి రోజూ ఎంత మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠాలు విన్నారో వివరాలను సాయంత్రానికి కార్యాలయానికి పంపించాలని ఆదేశాలు ఇచ్చాం. - ఎస్‌.అబ్రహం, డీఈవో

ఆన్​లైన్​లో తరగతులు వినగలిగిన వారి వివరాలు

ఇదీ చదవండి:వర్చువల్ ప్రయోగశాలలు.. ఇంటివద్దనే ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రాక్టికల్స్!

ABOUT THE AUTHOR

...view details