కార్తిక పౌర్ణమి, మూడో సోమవారం పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. శైవ క్షేత్రాల్లో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. స్వామి దర్శనాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శివనామ స్మరణతో దేవాలయాలు మార్మోగుతున్నాయి. కర్నూలు జిల్లా శ్రీశైలంలో తెల్లవారుజాము నుంచి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా సమీపంలోని కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం పరిధిలోని గౌతమి.. వృద్ధ గౌతమి.. గోదావరి నది తీరాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి గోదావరి తీరానికి చేరుకుని మహిళలు దీపాలు వెలిగించి గోదావరి నదిలో వదిలారు. వేదపండితులకు కార్తిక దామోదర మంత్రం పఠిస్తూ దీప తర్పణం చేసి ఆశీర్వాదం పొందారు. కరోనా నిబంధనలు నేపథ్యంలో పోలీసులు పరిమిత సంఖ్యలోనే భక్తులను స్నానఘట్టాల వద్దకు అనుమతించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలు భక్తులతో రద్దీగా మారాయి. శివనామస్మరణతో మార్మోగాయి. ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.