కరోనా తమను ఎక్కడ కబళిస్తుందోననే మానసిక ఆందోళనకు గురైన ఓ కుటుంబం.. ఏడాదిన్నరగా ప్రపంచానికి దూరంగా, స్వీయ గృహనిర్బంధంలో ఉన్న ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండల పరిధిలోని ఓ గ్రామంలో వెలుగుచూసింది. ఆ కుటుంబంలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉండగా తండ్రి, కుమారుడు మాత్రమే బయటకు వస్తున్నారు. తండ్రికి వచ్చే దివ్యాంగ పింఛను, రేషన్ బియ్యంతోనే కాలం గడుపుతూ వచ్చారు.
ప్రభుత్వం వారికి ఇంటి స్థలం మంజూరు చేయడంతో.. ఇటీవల పంచాయతీ సిబ్బంది వెళ్లి ఆ ఇంట్లోని మహిళను బయోమెట్రిక్ వేలిముద్ర వేయాలని అడిగారు. తాము బయటికి రామని, ఇంటిస్థలం వద్దు.. వెళ్లిపోవాలని ఆమె కోరారు. ఈ విషయం సర్పంచి ద్వారా తెలుసుకున్న పోలీసులు.. వారిని ఆదివారం మధ్యాహ్నం బయటికి తీసుకొచ్చారు. సరైన పోషకాహారం లేక ఆ ముగ్గురు మహిళలు అనారోగ్యంతోపాటు మానసికంగానూ ఇబ్బందిపడుతున్నట్లు గుర్తించి.. రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించామని ఎస్సై కృష్ణమాచారి తెలిపారు.