ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద కష్టాల్లో గోదావరి రైతులు.. - తూర్పు గోదావరి జిల్లా వార్తలు

కరోనాతో కుదేలైన రైతులను వరదలు పీకల్లోతు నష్టాల్లో ముంచేశాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో అరటి రైతులకు.. తీరని నష్టాన్ని మిగిల్చాయి. వరద ముంపు నుంటి బయటపడి కుళ్లిపోయిన పంటలను చూసి.. అన్నదాత గుండె చెరువవుతోంది.

వరద కష్టాల్లో గోదావరి రైతులు
వరద కష్టాల్లో గోదావరి రైతులు

By

Published : Aug 27, 2020, 6:01 AM IST

ఆరుగాలం శ్రమించిన రైతు కష్టం ఈ ఏడాది గోదావరి పాలైంది. గతేడాది మిగిల్చిన నష్టం నుంచి పూర్తిగా కోలుకోక ముందే వరదలు మరోసారి రైతు వెన్ను విరిచాయి. పంట చేతికందే సమయానికి వరదలు పోటెత్తడంతో అవన్నీ ఎందుకు పనికిరాకుండా పోయాయి. రూపాయి, రూపాయీ కూడబెట్టుకుని పెట్టిన పెట్టుబడంతా వరదపాలైంది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విపరీతంగా పంట నష్టం రావటంతో వేలాది రైతులు ఆవేదన చెందుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురం, రావులపాలెం, ఆలమూరు, కొత్తపేట, పి.గన్నవరం, అయినవిల్లి తదితర ప్రాంతాల్లో ప్రజల జీవనాధారం పంటలే. అరటి, కంద, కూరగాయలు, పత్తి సహా పూలసాగూ చేస్తుంటారు. పొలాల్లో వరదనీరు వారానికిపైగా నిల్వ ఉండిపోవటంతో పంట అంతా నాశనమైందని రైతులు బాధపడుతున్నారు. జిల్లాలో దాదాపు 3వేల 900 హెక్టార్ల అరటి, 2 వేల 900 హెక్టార్ల కూరగాయలు, 3వేల 600 హెక్టార్ల వరి దెబ్బతినటంతో 22 వేల మందికి పైగా రైతులు నష్టపోయారు.

వరదలు రాకమునుపు కరోనాతో ఎగుమతులన్నీ నిలిచిపోయాయని ఇప్పుడు ఎగుమతి చేసేందుకు పంటే లేకుండా పోయిందని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. వీలైనంత త్వరగా ప్రభుత్వం పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి :అప్పులతో పంటల సాగు... ఆశలన్నీ నీటి పాలు!

ABOUT THE AUTHOR

...view details