తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం రామకృష్ణాపురానికి చెందిన ఓ వ్యక్తి తన తండ్రికి మధుమేహం, బీపీ ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉండటంతో 15 రోజులకోసారి కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లేవారు. కొవిడ్ నేపథ్యంలో కొన్నాళ్లుగా ఓపీకి వెళ్లడం లేదు. ఇప్పుడు ఇంటి నుంచే ఆన్లైన్లో వైద్య సలహాలు పొందుతూ వారి సూచనల మేరకు మందులు వేసుకుంటున్నారు.
కోరుకొండ మండలం బుచ్చింపేటకు చెందిన అయిదు నెలల గర్భిణి ప్రతి 15 రోజులకోసారి చెకప్ కోసం రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లేవారు. కొవిడ్ తీవ్రత, రవాణా సమస్యలతో వెళ్లడం వీలుకుదరలేదు. వైద్యురాలిని ఫోన్లో సంప్రదిస్తే ఆన్లైన్ వైద్యం ఉపాయం చెప్పారు. నెలకు రెండు సార్లు వెళ్లాల్సి ఉన్నా.. ఒకసారి నేరుగా వెళ్లి ఇంకోసారి ఆన్లైన్లో సేవలు పొందుతున్నారు.
ప్రస్తుతం కరోనా తీవ్రత నేపథ్యంలో సాధారణ వైద్యసేవలకు ఆసుపత్రికి వెళ్లాలంటే కుదరని పరిస్థితి. మరోపక్క కర్ఫ్యూ నిబంధనల కారణంగా రవాణా సౌకర్యం లేక రాకపోకలూ సాగడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆన్లైన్ వైద్యానికి రోగులు, వైద్యులు ప్రాధాన్యమిస్తున్నారు. వైద్యులు వీడియో కాల్, స్కైప్లో రోగుల నాడిపట్టి వారికి మందులిస్తూ భరోసా కల్పిస్తున్నారు. మొదటిసారి నేరుగా రోగిని చూసి తర్వాత నుంచి ప్రతి 15 రోజులకోసారి ఆన్లైన్లో ఓపీ చూసి మందులు రాస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఆన్లైన్ వైద్యసేవలకు 30 శాతం మంది మక్కువ చూపిస్తున్నట్లు వైద్యవర్గాల అంచనా. సుమారు 400 నుంచి 500 మంది వైద్యులు తమ రోగులను ఆన్లైన్ ద్వారా పలకరిస్తున్నారు.
రోజూ 20 మంది వరకు...
నిత్యం 15 నుంచి 20 మందికి ఆన్లైన్లో వైద్యసేవలందిస్తున్నా. వీడియోకాల్లో ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ అవసరాన్ని బట్టి మందులు మార్చుతున్నాం. బీపీ, మధుమేహం, జ్వరం, పల్స్, హార్ట్బీట్ తెలుసుకునే పరికరాలు కొనుగోలు చేసుకుని వారి వంతు వచ్చినప్పుడు వీడియోకాల్లో వైద్యుడికి చెబితే ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా అంచనా వేసే వీలుంటుంది. అత్యవసర చికిత్స అవసరమైతే ఏ సమయంలో ఫోన్ చేసినా మాట్లాడుతున్నాం. -డాక్టర్ వడ్డాది సురేష్, ఎండీ (జనరల్ మెడిసిన్)
వినియోగించుకోవాలి..