ఆంధ్రప్రదేశ్

andhra pradesh

antharvedi ratham: రథం దగ్ధం ఘటనకు ఏడాది... సీబీఐ జాడేది..

By

Published : Sep 5, 2021, 7:16 AM IST

తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆవరణలో దివ్యరథం దగ్ధమై నేటికి ఏడాది గడిచింది. 2020 సెప్టెంబరు 5న అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై అప్పట్లో పలు పార్టీలు, భక్తులు ఆందోళన చేశారు. దీంతో కేసును సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నేటితో ఏడాది గడిచినా సీబీఐ ఇంకా రంగంలోకి దిగలేదు.

antharvedi ratham
అంతర్వేదిలో రథం దగ్ధం

నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటి తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది. ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆవరణలో దివ్యరథం దగ్ధమై నేటికి ఏడాది గడిచింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక కుట్రకోణం ఉందా అన్నది నేటికీ తేలలేదు. 2020 సెప్టెంబరు 5న అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై అప్పట్లో భక్తులు, స్వామి వాహన సేవకులు, విశ్వహిందూ పరిషత్తు, బజరంగదళ్‌, భాజపా, జనసేన పార్టీలతో పాటు పలు సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏడాది గడిచినా నేటికీ సీబీఐ రంగంలోకి దిగలేదు.

56 ఏళ్లపాటు స్వామికి వాహన సేవ అందించిన పాత రథం అగ్నికి ఆహుతవ్వడంతో ప్రభుత్వం రూ.1.10 కోట్లతో ఏడు అంతస్తుల కొత్త రథాన్ని 90 రోజుల్లో నిర్మించింది. లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 19న ముఖ్యమంత్రి జగన్‌ ఈ రథాన్ని లాగి ప్రారంభించారు. దీన్ని తాత్కాలిక రేకుల షెడ్డులోనే ఉంచారు. శాశ్వత ప్రాతిపదికన భవనాన్ని నిర్మించి పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని పలువురు భక్తులు కోరుతున్నారు.

త్వరలో సీబీఐ నిర్ణయం వెలువడే అవకాశం...

" ఈ కేసును ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేసింది. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి కార్యాలయం నుంచి సంబంధిత శాఖకు లేఖ వెళ్లింది. వారు ఆమోదించి, బృందాన్ని జిల్లాకు పంపాల్సి ఉంది. ఇది ఆ విభాగం పరిశీలనలో ఉంది. వారు కేసును స్వీకరించి, సీబీఐ బృందం జిల్లాకు వస్తే.. పోలీసు శాఖ నుంచి పూర్తి వివరాలు అందజేస్తాం. సీబీఐ నిర్ణయం కొద్దిరోజుల్లో వెలువడే అవకాశం ఉంది. ఒక వేళ వారు విచారణకు ఆమోదం తెలపకపోతే పోలీసు దర్యాప్తు కొనసాగుతుంది." - ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఎస్పీ, తూర్పుగోదావరి జిల్లా

ఇదీ చదవండి: అనపర్తి మండలంలో 12 మంది విద్యార్థులకు కరోనా

ABOUT THE AUTHOR

...view details