ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Asha Workers Protest: ఆశా కార్యకర్తల ఆందోళనలు.. ఆశాలను ఈడ్చుకెళ్లిన పోలీసులు - ఆశా కార్యకర్తల ఆందోళనలు

Asha Workers Protest: కొవిడ్ విధుల్లో చనిపోయిన ఆశా వర్కర్ల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఆశా కార్యకర్తలు తలపెట్టిన ఆందోళన రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్తతకు దారితీసింది. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు కాకినాడ కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించారు. బారికేడ్లను తోసుకొని చొచ్చుకొచ్చిన ఆశావర్కర్లు, పోలీసులకు మద్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పలువురు స్పృహతప్పి పడిపోగా.. మరికొందరికి గాయాలయ్యాయి.

కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆశా కార్యకర్తల ఆందోళన...అరెస్టు
కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆశా కార్యకర్తల ఆందోళన...అరెస్టు

By

Published : Feb 7, 2022, 12:52 PM IST

Updated : Feb 8, 2022, 3:17 AM IST

కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆశా కార్యకర్తల ఆందోళన

Asha workers protest: కొవిడ్‌తో చనిపోయిన ఆశాల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, కనీస వేతనాలు చెల్లించాలని, పని ఒత్తిడి తగ్గించాలని, పదవీవిరమణ ప్రయోజనాలు అందించాలని డిమాండ్‌ చేస్తూ.. ఆశా కార్యకర్తలు తలపెట్టిన ఆందోళన రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్తతకు దారితీసింది. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు కాకినాడ కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించారు. సుందరయ్యభవన్‌కు చేరుకున్న వీరంతా ప్రదర్శనగా రావడంతో పోలీసులు ఇంద్రపాలెం కూడలి వద్ద బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. వాటిని తోసుకొని కలెక్టరేట్‌వైపు దూసుకొస్తున్న కార్యకర్తలను నిలువరించే క్రమంలో పోలీసులకు వారికి మధ్య తోపులాట చోటుచేసుకుంది. తోపులాటలో చేతి గాజులు పగిలి పలువురికి రక్తస్రావమవగా.. పోలీసులు ఈడ్చుకెళ్లే క్రమంలో మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. పెనుగులాటలో జిల్లా కమిటీ సభ్యులు పలివెల సత్యవతి సొమ్మసిల్లి పడిపోయారు. ఉషారాణికి చేతికి గాయమైంది. మరో కార్యకర్త కాలికి గాయమై విలపించారు. మహిళలపైన పురుష కానిస్టేబుళ్లు చేయి చేసుకున్నారంటూ పలువురు కార్యకర్తలు విరుచుకుపడ్డారు.

అరెస్టు చేసినవారిని ఎక్కించిన వాహనాలు ముందుకు కదలకుండా అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. తోపులాటలో ఓ మహిళా కానిస్టేబుల్‌ కిందపడిపోయారు. కొందరు పోలీసులకూ స్వల్ప గాయాలయ్యాయి. ఆందోళనకారులను పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లోకి ఎక్కించి స్టేషన్లకు తరలించారు. ముందస్తుగా ఐదుగురు ముఖ్య నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. పరిస్థితి సద్దుమణిగింది అనుకునేలోపు మరోసారి ఆశాలు ఇంద్రపాలెం కూడలిలో బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో వారిని వాహనాల్లోకి ఎక్కించి కలెక్టరేట్‌ వెనక ధర్నాచౌక్‌కు తరలించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఆందోళనలు సాగాయి. జిల్లా మొత్తం మీద 254 మందిని అరెస్టు చేశారు. అందులో కాకినాడలోనే 210 మంది ఉన్నారు. కొవిడ్‌తో చనిపోయిన ఆశా కార్యకర్తలకు పరిహారం, ఉద్యోగం ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం సరికాదని ఆశా వర్కర్ల యూనియన్‌ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు జుట్టు పట్టుకుని లాక్కెళ్లారని పిఠాపురం నుంచి వచ్చిన కరుణ అనే కార్యకర్త వాపోయారు.

చిత్తూరులో అడుగడుగునా అడ్డంకులు

డిమాండ్ల సాధనకు వివిధ ప్రాంతాల నుంచి చలో కలెక్టరేట్‌కు వస్తున్న ఆశా కార్యకర్తలను చిత్తూరులోని ప్రధాన కూడళ్లలో ఉదయం ఆరు గంటల నుంచే పోలీసులు భారీస్థాయిలో మోహరించి, అడ్డుకున్నారు. నిర్బంధాలు ఛేదించుకొని కలెక్టరేట్‌ వద్దకు వచ్చిన సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు, ఉపాధ్యక్షులు వెంకటయ్యతో పాటు పలువురు ఆశా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లి నుంచి చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌ ముట్టడికి 24 మంది ఆశా కార్యకర్తలను మదనపల్లె ఒకటో పట్టణ పోలీసులు స్టేషన్‌కు తరలించారు. మరికొందరు పోలీసుల కళ్లుగప్పి బయలుదేరగా.. బంగారుపాళ్యం మండలం మహాసముద్రం టోల్‌ప్లాజా వద్ద అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. పోలీసులు వారిని బంగారుపాళ్యం స్టేషన్‌కు తీసుకెళ్లారు.

ఇదీ చదవండి:

రూ.900 కోసం కన్నతండ్రినేే కడతేర్చిన కుమారుడు

Last Updated : Feb 8, 2022, 3:17 AM IST

ABOUT THE AUTHOR

...view details