ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 14, 2021, 6:49 AM IST

ETV Bharat / state

నీటికి కటకట.. ట్యాంకర్లు తగ్గి కష్టాలు

గత ఏడాది తగినన్ని వర్షాలు కురిసి చెరువుల్లోకి నీరు చేరిందన్న కారణంతో ఈ ఏడాది ట్యాంకర్లతో నీటి సరఫరాను తగ్గించడంతో పలు జిల్లాల్లో గ్రామీణ ప్రజలు తాగునీటికి అవస్థలు పడుతున్నారు. గత ఏడాది ఇదే సీజన్‌లో 2,793 ఆవాస ప్రాంతాలకు ట్యాంకర్లతో రోజూ 13,253 ట్రిప్పులు నీటిని సరఫరా చేశారు. ఈ ఏడాది 284 ఆవాస ప్రాంతాలకు ట్యాంకర్లతో రోజూ 2,886 ట్రిప్పుల నీటిని అందిస్తున్నారు. 70 శాతానికిపైగా సరఫరాను కుదించారు. అయితే అధికారుల అంచనాల కంటే భిన్నంగా అనేక గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఈ ఏడాది కూడా తీవ్రంగా ఉంది.

water problems
water problems

ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 280 ఆవాస ప్రాంతాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ కొన్ని మండలాల్లో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ట్యాంకర్లతో నీటి సరఫరా తగ్గించడంతో చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో పలు గ్రామాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది. కడప, కర్నూలు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ట్యాంకర్లతో నీటి సరఫరా అవసరమే లేదన్న నిర్ధారణకు అధికారులు వచ్చినా కృష్ణా, నెల్లూరు జిల్లాల్లోగల తీర ప్రాంత గ్రామాల్లో ప్రజలు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. ఈ గ్రామాల్లో నీటి పథకాలు సైతం సరిగా పని చేయడం లేదు.

తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం రామరాజులంక పంచాయతీలో రెండు రోజులకోసారి నీళ్లు సరఫరా చేస్తున్నా అవి ప్రజలకు సరిగా అందడం లేదు. ఓవర్‌హెడ్‌ ట్యాంకు నుంచి పైపులైన్లు సరిగా వేయకపోవడంతో ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నా ఉపయోగం లేకపోతోంది. రామరాజులంకతోపాటు శివారు అరుంధతిపేట ప్రజలు పైపులైన్లకు రంధ్రాలు చేసి రబ్బరు ట్యూబ్‌ సాయంతో నీళ్లు పట్టుకుంటున్నారు.

పకాశం జిల్లా పొదిలి మండలం అక్కచెరువు గ్రామానికి ట్యాంకర్లతో గతంలో రోజూ 24 ట్రిప్పులు నీరు సరఫరా చేసేవారు. ప్రస్తుతం కుదించి 13 ట్రిప్పులు అందిస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. 1,400 జనాభా కలిగిన ఈ గ్రామంలో చెరువు ఉన్నా నీళ్లకు ట్యాంకర్లపైనే ప్రజలు ఆధారపడుతున్నారు. 800 వరకూ ఉన్న పశువులకూ ఇదే నీరు దిక్కు

అదనపు నీటి ట్యాంకర్ల సరఫరాకు ఇబ్బంది లేదు

‘గత ఏడాది తగినన్ని వర్షాలు కురవడంతో చాలా జిల్లాల్లో ఈ ఏడాది తాగునీటికి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో గత ఏడాది కంటే గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా తగ్గించాం. ఎక్కడైనా ట్యాంకర్లు సరిపోవడం లేదన్నా, నీటికి ఇబ్బంది ఉంద[ని చెప్పినా అదనపు ట్రిప్పులు పంపేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. తాగునీటి సమస్యల పరిష్కారానికి మండల స్థాయిలోనూ అధికారులతో కమిటీలు ఏర్పాటు చేశాం. సమస్యను వారి దృష్టికి తీసుకొస్తే ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేస్తారు. ఈ ఏడాది తాగునీటి సమస్యను ఎదుర్కొనేందుకు రూ.109.81 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నాం’.- కృష్ణారెడ్డి, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఈఎన్‌

ఇదీ చదవండి:ఈ నెల 20న శాసనసభ, శాసన మండలి సమావేశం

ABOUT THE AUTHOR

...view details