కడప, చిత్తూరు జిల్లాల్లో సుమారు 20 వేల హెక్టార్లకుపైగా టమాటా సాగు అయ్యింది. తెగుళ్లు, అధిక వర్షాలతో కాయలు పాడైపోయాయి. ఇందుకు తోడు దళారుల చేతిలో మోసపోతున్న కారణంగా.. రైతుకు నష్టాలే మిగులుతున్నాయి.
''పంట చేతికొచ్చే సమయంలో కురిసిన చెదురు మదురు వర్షాలకు.. చెట్లకు బూడిద తెగులు సోకి కాయలు నల్లగా మాడిపోతున్నాయి. ఎన్ని పురుగు మందులు వాడినా ఫలితం ఉండడం లేదు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేస్తే చివరికి చేతికొచ్చేది వేలల్లోనే. తీవ్ర నష్టాలు వస్తున్నాయి. వర్షాలు, తెగుళ్ళు తట్టుకొని కాస్తోకూస్తో దిగుబడి వచ్చేసరికి మార్కెట్లో మద్దతు ధర ఉండటంలేదు. అధిక కూలీ ఇచ్చి కాయలు తెంపించి మార్కెట్కు తరలిస్తే అక్కడ దళారుల చేతిలో మోసపోతున్నాం. రైతుల దగ్గర తక్కువ ధరకు కొని వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్ముతూ దళారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక్కోసారి రవాణా ఖర్చులు రాక టమాటాలు కోసి రోడ్లమీద పారబోస్తున్నాం' అంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు.
రాయలసీమలోని కడప, చిత్తూరు, అనంతపురంలో టమాటాను అత్యధికంగా సాగు చేస్తారు. టమాటా విక్రయానికి మదనపల్లి మార్కెట్ పెట్టింది పేరు. రైతులు పంటను ఇక్కడికే ఎక్కువగా తీసుకొస్తుంటారు. తీరా ఇక్కడికొచ్చాక గిట్టుబాటు ధర లేక.. తిరిగి తీసుకెళ్లలేక దళారులు అడిగిన రేటుకు ఇచ్చేయడమో లేదా రోడ్డుమీద పారబోయడమో చేస్తున్నారు.