ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'శ్రీజ'..వారు సరఫరాదారులే కాదు యజమానులు

By

Published : Mar 8, 2020, 10:12 AM IST

పాలిచ్చి పెంచే తల్లులకు పాలించడం ఓ లెక్కా.? ఈ సినిమా డైలాగ్‌ను మరోలా చెప్తున్నారు ఆ మహిళలు.! పాలిచ్చి పెంచే తల్లులకు పాల వ్యాపారం ఓ లెక్కా అని సవాల్‌ విసురుతున్నారు. అందివచ్చిన అవకాశంతో పాల విప్లవం సృష్టించారు. పాడి రైతులుగా రాణిస్తూ.. ఓ డెయిరీని విజయ పథంలో నడిపిస్తున్నారు. ఆర్థిక స్వావలంబన సాధించి స్త్రీ శక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు.

srija is the worlds largest female dairy in chittor district
srija is the worlds largest female dairy in chittor district

'శ్రీజ'..వారు సరఫరాదారులే కాదు యజమానులు కూడా

విజయది చిత్తూరు పక్కనున్న మాధవరం గ్రామం. పది ఆవులున్న ఆమె వాటి పాలు అమ్మి నెలకు రూ.45వేలు సంపాదిస్తోంది. అంతేకాదు, ఆమె పేరున 174 షేర్లు కూడా ఉన్నాయి. రోజూ పదిహేను లీటర్ల పాలు అమ్మే అనురాధకు కూడా 56 షేర్లు ఉన్నాయి. ఆ షేర్ల మీద బోనసులు, డివిడెండ్లూ అదనంగా వస్తుంటాయి. పల్లెటూళ్లలో పాలు అమ్మే గృహిణులకు షేర్లూ డివిడెండ్లూ ఏమిటంటారా... శ్రీజ మహిళా పాల ఉత్పత్తిదారుల సంఘంలో సభ్యులైనందుకే ఆ అదనపు ఆదాయం.

సుగ్గియమ్మ భర్త గ్రానైట్‌ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అతడి జీతానికి తోడు ఒక పాడి గేదెతో నెట్టుకొస్తున్న ఆమె తోటివారిని చూసి ధైర్యంచేసి ఒకదాని తర్వాత ఒకటి చొప్పున ఆరు పశువులను కొంది. వాటి పాలు అమ్మగా వచ్చిన డబ్బు దాచుకుని పూరిల్లు స్థానంలో డాబా ఇల్లు కట్టుకుంది. ఒకరూ ఇద్దరూ కాదు, శ్రీజ సంస్థలో సభ్యులైన దాదాపు 80 వేల మందీ ఇలాంటి కథలే చెబుతారు.

ఎలా మొదలైందంటే...

రాష్ట్రంలో మొదటినుంచీ పాల ఉత్పత్తిలో చిత్తూరు జిల్లా ముందువరసలో ఉండేది. లక్షల కుటుంబాలు దానిమీదే ఆధారపడి బతుకుతున్నాయి. ప్రైవేటు డెయిరీలూ ఎక్కువే. ప్రభుత్వం కూడా భారీ శీతలీకరణ యూనిట్లను పెట్టింది. కానీ పాడి రైతులకు గిట్టుబాటు ధర రావాలంటే పాల ఉత్పత్తిదారుల సంస్థల్ని కంపెనీల చట్టం కింద నమోదు చేసుకునేలా ఉంటే బాగుంటుందని భావించింది జాతీయ పాడి అభివృద్ధి సంస్థ(ఎన్‌డీడీబీ). అలా చేస్తే ఉత్పత్తిదారులే సంస్థ యజమానులు కూడా అవుతారు. ఆ చట్టం కింద ఎన్‌డీడీబీ ఆధ్వర్యంలో ఏర్పాటైన తొలి మహిళా పాల ఉత్పత్తిదారుల కంపెనీనే ఈ శ్రీజ డెయిరీ.

80 వేల మంది వాటాదారులు

2014 సెప్టెంబరులో 27 మంది వాటాదారులతో ప్రారంభమైన ఈ సంస్థలో ఇప్పుడు దాదాపు 80 వేలమంది వాటాదారులున్నారు. వందలీటర్లకు ఒక వాటా చొప్పున విక్రయించి వాటాదారుల నుంచి రూ.17 కోట్ల మూలధనాన్ని సమకూర్చుకుంది సంస్థ. పదిహేను మందితో కూడిన పాలకమండలి సంస్థ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. అధ్యక్షురాలితో సహా అందరూ మహిళలే. 2018-19లో 12.43 కోట్ల లీటర్ల పాలను సేకరించిన సంస్థ వచ్చిన ఆదాయంనుంచి రూ.5.23 కోట్లను వాటాదారులకు పంచింది. తిరుపతి కేంద్రంగా పనిచేస్తున్న శ్రీజ సంస్థలో పాలక మండలి స్థాయి నుంచి క్షేత్రస్థాయిలో పాలసేకరణ వరకూ దాదాపు మూడువేల మంది వివిధ హోదాల్లో కంపెనీ పనుల్లో భాగస్వాములు అవుతున్నారు. పొరుగున ఉన్న నెల్లూరు, అనంతపురం జిల్లాలకు కూడా ఈ డెయిరీ సేవలు విస్తరించాయి.

ఏమిటీ లాభం

సహజంగా పాడి పరిశ్రమలో మహిళల కష్టమే ఎక్కువ. డబ్బు మాత్రం మగవారి చేతికే అందేది. కానీ, ఇక్కడ పాల డబ్బు పదిహేను రోజులకోసారి నేరుగా మహిళల ఖాతాలో జమవుతుంది. దాంతో వారి శ్రమకు గుర్తింపు లభించినట్లవుతోంది. గ్రామీణ మహిళల సాధికారతకు ఇది తోడ్పడుతోంది. సరఫరాదారులూ యజమానులూ కూడా వాళ్లే కాబట్టి పాల నాణ్యతకూ ఢోకా ఉండదు. సభ్యులకే కాదు, పాడి పశువులకీ బీమా చేయించుకునే అవకాశం కల్పిస్తుంది సంస్థ. అలా బీమా చేసిన పశువు చనిపోతే నష్టపరిహారం లభిస్తుంది కాబట్టి యజమానికి ఆర్థికభారం ఉండదు. పశువుల దాణా, వాటి ఆరోగ్యమూ, పరిశుభ్రతా తదితర విషయాలన్నిటిలోనూ తరచూ సంస్థే శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది.

ఆధునిక సాంకేతికత

కరెంటు పోతే పాలశీతలీకరణ కేంద్రాలకు ఇబ్బంది. ఆ సమస్య లేకుండా శ్రీజ డెయిరీ నిర్వహిస్తున్న పాలసేకరణ, శీతలీకరణ కేంద్రాలన్నీ సౌరవిద్యుత్తుతో పనిచేస్తాయి. జీపీఆర్‌ఎస్‌ అనుసంధానంతో అన్ని కేంద్రాల నుంచీ సమాచారం ఎప్పటికప్పుడు కార్పొరేట్‌ కార్యాలయానికి చేరుతుంది. సేకరించిన పాలని తిరుపతిలోని బాలాజీ డెయిరీలో ప్రాసెసింగ్‌ చేస్తారు. పాల కొనుగోలుదారుల కోసం ఆప్‌ను కూడా రూపొందించింది శ్రీజ. పాల ఉత్పత్తులను అమ్మే రిటైల్‌ దుకాణాలను కూడా మహిళలకే అప్పగించే ఆలోచనలో ఉన్న ఈ సంస్థ అమూల్‌ పాపలాగే తమ డెయిరీకీ ఓ పాపని బ్రాండ్‌ అంబాసిడర్‌గా పెట్టుకోవాలనుకుంటోంది. అతి తక్కువ కాలంలోనే ప్రపంచంలోనే పెద్ద మహిళా డెయిరీగా శ్రీజని నిలబెట్టిన ఈ మహిళలు అభినందనీయులు కదా!

ఇదీ చదవండి : రయ్యి రయ్యిమంటూ దూసుకుపోతున్న మహిళా బైక్ రైడర్స్

ABOUT THE AUTHOR

...view details