బడి ఆహ్లాదకరంగా ఉంటే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందనే భావన ఒకరిది.. భయాన్ని తొలగిస్తే గణితంలో మార్కులు కొల్లలే అనే నమ్మిక మరొకరిది.. తమదైన మార్గంలో ప్రత్యేక ముద్రవేస్తూ ముందుకుసాగారా ఉపాధ్యాయులు. స్ఫూర్తిదాయక ఫలితాల్ని సాధించి తోటివారిలో ప్రేరణ కలిగిస్తున్నారు. వారే విశాఖపట్నం జిల్లాకు చెందిన ఫణిభూషణ్ శ్రీధర్, చిత్తూరు జిల్లా వాసి మునిరెడ్డి. వీరి సేవలకు గుర్తింపుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు లభించాయి. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం-2021కి ఎంపికైన వారి పేర్లను కేంద్ర విద్యాశాఖ బుధవారం ప్రకటించింది. ఈ జాబితాలో దేశవ్యాప్తంగా 44 మంది ఉండగా... తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున నలుగురికి చోటు లభించింది. పురస్కారం కింద ఒక్కొక్కరికీ రూ.50 వేల నగదు, పతకం, ప్రశంసపత్రాలను సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందిస్తారు.
బడులన్నీ నందన వనాలే..
కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ది విశాఖ జిల్లా అనకాపల్లి. ప్రస్తుతం ఎస్.రాయవరం మండలం లింగరాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్. 24 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ)గా పని చేసినప్పుడు పర్యావరణ సంరక్షణ, సామాజిక నర్సరీలు, ఘన వ్యర్థాల నిర్వహణ, దాతల విరాళాలతో మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల సంఖ్య పెంపునకు చేసిన కృషికి గుర్తింపుగా ఫణిభూషణ్ శ్రీధర్కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం దక్కింది. నక్కపల్లి మండలం అయ్యన్నపాలెంలో 1997లో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా చేరిన ఆయన ఐదేళ్లకే జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారం అందుకున్నారు.
ఇప్పటి దాకా వివిధ అంశాల్లో 43 అవార్డులను పొందారు. ఎక్కడ పనిచేసినా ఆ బడిని నందనవనంగా తీర్చిదిద్దుతారు. పాఠశాల అభివృద్ధికి సొంత నిధులు ఖర్చు చేస్తుంటారు. బడిలో ఆహ్లాదకర వాతావరణం ఉంటే విద్యార్థులను ఆకట్టుకోవచ్చన్నది ఆయన భావన. పలు గ్రామాల్లో నాటికలు, కళాజాత నిర్వహించారు. మధ్యాహ్న భోజనానికి అవసరమైన కూరగాయలను సేంద్రియ ఎరువులతో బడుల ప్రాంగణాల్లో పండించడంలో కృషి చేశారు. అనకాపల్లి మండలం మూలపేట బడిలో ఫణిభూషణ్ శ్రీధర్ వెళ్లే సమయానికి 18 మంది విద్యార్థులు ఉండగా.. ఆ సంఖ్యను 52కు పెంచారు. దాతల నుంచి రూ.5.5 లక్షలు సేకరించి మౌలిక సదుపాయాలు కల్పించారు. గత జనవరిలో స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందారు.