శివరాత్రి ఉత్సవాలకు కొనసాగుతున్న ఏర్పాట్లు
మహాశివరాత్రిని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నెల 16 నుంచి 28 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు దేశ నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవ నిర్వహణకు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నెల 16 నుంచి 28 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు దేశ నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో వసతులు కల్పించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ముక్కంటి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. విద్యుత్ దీపాలు, ఆకట్టుకునే రంగవల్లులతో ముస్తాబు చేస్తున్నారు. దాతల సహకారంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిపేందుకు చర్యలు చేపట్టినట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.