ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నమస్కారం పెడితే అంతే సంగతులు.. - TTD

ఎన్నికల ప్రచారంలో ఎన్నో సిత్రాలు చూస్తాం..ఆయన మాత్రం నమస్కారం పెట్టి మరీ చిత్రం చూపిస్తారు. ప్రచారమంటూ మీ ఇంటికొచ్చి దండం పెడతాడు. మీరు నవ్వుతూ ప్రతినమస్కారం చెప్పగానే దగ్గరికి తీసుకుని ఫోటో దిగుతాడు. తెల్లారేసరికి మీకు బొమ్మ చూపిస్తాడు.

నమస్కారం పెడితే అంతే సంగతులు..

By

Published : Apr 2, 2019, 7:34 PM IST

Updated : Apr 2, 2019, 11:20 PM IST

భూమన కరుణాకర్ రెడ్డి....వైకాపా సీనియర్ నేతలలో ఒకరు. 2012లో తిరుపతి ఎమ్మెల్యేగా, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్​గా పనిచేశారు. ఎవరైనా ఆయన దగ్గరకు వెళ్లి కరచాలనం చేసిందే పాపం..ఇష్టం ఉన్నా లేకున్నా మెడలో కండువా వేయటం....వారితో కలిసి ఫోటోలు దిగటం క్షణాల్లో జరిగిపోతాయి. ఇక్కడితో భూమన స్క్రీన్​ప్లే అయిపోదు..వైకాపాలో భారీగా చేరికలు అంటూ మరుసటిరోజు పత్రికలో ఉదయాన్నే కలర్ ఫోటోలు దర్శనమిస్తాయి. అంతే ఇక అవాక్కవటం ఆ ప్రజల వంతవుతుంది.

నమస్కారం పెడితే అంతే సంగతులు..

తెదేపా తరపున ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వారిలో తుడా ఛైర్మన్ నరసింహయాదవ్ ఒకరు. టికెట్ దక్కకపోవటంతో ఓ సమయంలో ఆయన పూర్తి నిరాశకు లోనయ్యారు. స్వయంగా చంద్రబాబు నచ్చజెప్పటంతో తెదేపా అభ్యర్థి సుగుణమ్మకు మద్దుతుగా నిలుస్తున్నారు. ప్రచారంలో భాగంగా నరసింహయాదవ్ మేనల్లుడు రాజా యాదవ్​ను కలిశారు. నమస్కారం చేసిన కరుణాకర రెడ్డికి తిరిగి ప్రతినమస్కారం చేయగా...దగ్గరకు తీసుకుని ఫోటో దిగారు. ఒక్కసారిగా పార్టీ కండువా సైతం కప్పారు. తర్వాతి రోజు ఉదయాన్నే పత్రికల్లో భూమన ఆధ్వర్వంలో పార్టీలో చేరిన తుడా ఛైర్మన్ మేనల్లుడు అని ప్రచురించారు. పేపర్​లో వచ్చిన ఫోటోలు చూసి బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు.

కరుణాకరరెడ్డికి ఈ తరహా ప్రచారాలు కొత్తనుకుంటే పొరపాటే. 2014 ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళ్లి ఓటెయ్యాలని ఓటర్లలతో ప్రమాణాలు చేయించుకొని ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురయ్యారు. ఈసారి మరోకొత్త ఎత్తుగడతో ఇలా సాధారణ ప్రజలను సైతం పార్టీలో చేరినట్లు...తెదేపా కార్యకర్తలు పార్టీ మారినట్లు చూపిస్తున్నారు. భూమన తీరుతో... జనాలు ... నాయకులు అవాక్కవుతున్నారు.

Last Updated : Apr 2, 2019, 11:20 PM IST

ABOUT THE AUTHOR

...view details