Mango Farmers Problems: ప్రకృతి ప్రకోపాలను సైతం తట్టుకోగలుగుతున్న మామిడి రైతులు.. సర్కారు కొట్టే దెబ్బలకు విలవిల్లాడిపోతున్నారు. బీమా లేక.. కవర్లపై రాయితీ రాక.. గిట్టుబాటు ధర లభించక అవస్థలు పడుతున్నారు. చీడపీడలను నివారించే వ్యవస్థ, సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేక సాగు, ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రంలోని మామిడి రైతులు దయనీయ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ఒకపక్క మంగు ప్రభావం, మరోపక్క గాలివానల బీభత్సం.. మామిడి రైతుల్ని దారుణంగా దెబ్బతీశాయి. అయినా తట్టుకుని ఉన్నంతలో చెప్పుకోదగ్గ స్థాయిలో దిగుబడులు సాధించారు. సకాలంలో అండగా నిలబడాల్సిన సర్కారు మాత్రం చేతులెత్తేసి.. రైతుల్ని గాలివానలకు వదిలేసింది. మూడేళ్ల కిందటి వరకు మామిడికి ఉన్న బీమాను ఎత్తేసి, వారిని చావుదెబ్బ కొట్టిన సర్కారు.. మామిడి నాణ్యతను పెంచేందుకు ఉపయోగించే ఫ్రూట్ కవర్లకు రాష్ట్ర ప్రణాళిక నుంచి నిధులివ్వడం మానేసి వారిని మరింతగా కష్టాల్లోకి నెట్టేసింది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఇక్కడ తోతాపురి సాగు ఎక్కువ. దీనిమీద ఆధారపడి 39 వరకు గుజ్జు పరిశ్రమలున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి మామిడి గుజ్జు పరిశ్రమ ఉందని, ఆయన అండతోనే వ్యాపారులు ధరలను తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. తోతాపురి రకానికి టన్నుకు 10 వేల నుంచి 12 వేల రూపాయలే ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. వాస్తవానికి టన్నుకు 19 వేలు ఇవ్వాలని కలెక్టర్ నిర్ణయించారు. ఆ తర్వాత 15 వేలు రూపాయలకు తగ్గించారు. ఆ ధరకు కూడా వ్యాపారులు కొనడం లేదు. గుజ్జు పరిశ్రమకు తీసుకెళ్తే టన్నుకు 11 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మామిడి రైతులు వాపోతున్నారు.
రైతులు ఎంతో కష్టపడి దిగుబడి సాధిస్తే అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. చీడపీడల ఉద్ధృతి కూడా పెరుగుతోంది. తామర పురుగు, పండు ఈగ కాయల నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. ఈ ఏడాది కూడా కొన్ని జిల్లాల్లో ఎకరాకు సగటున 4 టన్నుల దిగుబడి లభిస్తుండగా.. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల టన్ను కూడా రాని పరిస్థితులున్నాయి. సాధారణంగా ఏటా మార్చి, ఏప్రిల్ నెలల్లో విజయనగరం జిల్లా నుంచి సువర్ణరేఖ రకం ఎగుమతులు జోరుగా సాగేవి. ఈ ఏడాది మందగించాయి. సీజన్ ఆరంభంలో టన్ను 90 వేలకు పైగా పలికిన బంగినపల్లి రకం తర్వాత క్రమంగా తగ్గుతూ 25 వేల రూపాయల దిగువకు పడిపోయింది.