ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా ప్రభావం: ఆలయాలకు 'లాక్'.. ఆదాయం పూర్తిగా 'డౌన్'!

By

Published : May 16, 2020, 12:37 PM IST

ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలతో పాటు ఇతర ఆలయాలపైనా కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. నిత్యం భక్తులతో కళకళలాడే ఆలయాలు... భగవన్నామ స్మరణలతో మారుమోగే పుణ్యక్షేత్రాలు వెలవెలబోతున్నాయి. ఆర్జిత సేవలు సహా భక్తుల రాకతో వచ్చే ఆదాయం శూన్యమైంది.

తిరుమల సహా పలు ఆలయాలపై లాక్‌డౌన్‌ ప్రభావం
తిరుమల సహా పలు ఆలయాలపై లాక్‌డౌన్‌ ప్రభావం

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల శ్రీనివాసుడితోపాటు స్వయంభువుగా వెలసిన కాణిపాక వరసిద్ధి వినాయుకుడు, రాహుకేతు పూజలకు పేరెన్నికగన్న శ్రీకాళహస్తీశ్వరుడు కొలువైన చిత్తూరు జిల్లాలో.. పుణ్యక్షేత్రాలన్నీ లాక్‌డౌన్‌కు ముందు భక్తులతో కిటకిటలాడేవి. కరోనా వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో.. ఆలయాలన్నీ భక్తులు లేక వెలవెలబోతున్నాయి.

తిరుమల సప్తగిరుల్లో 50 రోజులుగా నిశ్శబ్దం ఆవరించింది. వసతి గదుల సేవలు, లడ్డూ ప్రసాదాల విక్రయాలు, ఆర్జిత సేవలు నిలిపేయగా.. ఖజానాకు ఆదాయం రావడంలేదు. శ్రీవారి ఆలయ ప్రవేశాన్ని భక్తులకు నిషేధించిన కారణంగా దాదాపు 200 కోట్ల రూపాయలపైబడి ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. రోజుకు సగటున హుండీ రూపంలోనూ... తలనీలాలు సహా మిగిలిన మార్గాల్లోనూ వచ్చే భారీ ఆదాయాన్ని కోల్పోయింది.

తిరుమల తర్వాత అధిక సంఖ్యలో భక్తులు వచ్చే శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలకూ ఆదాయం ఆగిపోయింది. రాహుకేతు పూజలకు దేశం నలుమూలల నుంచి శ్రీకాళహస్తి ఆలయానికి భక్తులు చేరుకొంటారు. హుండీ, రాహుకేతుల పూజల కోసం భక్తులు చెల్లించే సొమ్ము ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది.

వాయులింగేశ్వర ఆలయానికి హుండీ ద్వారా కోటీ పదిహేను లక్షలు, రాహుకేత పూజలు ద్వారా ఆరున్నర నుంచి ఏడు కోట్లు, ప్రసాదాల విక్రయాలు ద్వారా కోటి, వసతి గృహాల ద్వారా కోటి రూపాయల చొప్పున నెలకు పదికోట్ల రూపాయల మేర ఆదాయం సమకూరేది. రెండు నెలలుగా భక్తుల రాకపోకలు లేకపోవటంతో... దాదాపు 20 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. ఆదాయం కొరవడిన కారణంగా... దేవస్థానం అధికారులు పొదుపు చర్యలు చేపట్టారు.

స్వయంభువుగా వెలసిన కాణిపాకం వినాయకుని ఆలయం ఆర్థిక స్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. సాధారణ రోజుల్లో ఇరవై వేల నుంచి పాతిక వేలమంది.. వారాంతాల్లో 30 మంది వేల భక్తులు వినాయకుని దర్శనానికి తరలివస్తుంటారు. కాణిపాకం ఆలయంలో హుండీతోపాటు ప్రసాదాలు, ఆలయ ఆవరణలో నిర్మించిన దుకాణ సముదాయాల అద్దెలు, విరాళాల ద్వారా ఆదాయం సమకూరుతుంది.

గడచిన రెండు నెలలుగా హుండీ ద్వారా వచ్చే రెండు కోట్లు, దర్శన టికెట్ల విక్రయాలతో వచ్చే పదికోట్లు, ప్రసాదాల విక్రయాలతో మూడు కోట్లు, విరాళాల రూపంలో రెండు కోట్లు, దుకాణాల అద్దె ద్వారా మూడు కోట్లు.. మొత్తంగా ఇరవైకోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

లాక్‌డౌన్‌ ఎత్తేసిన తరువాత దర్శనాలకు భక్తులను అనుమతించేందుకు దేవదాయశాఖ సూచనల మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ తరువాత దర్శనాలకు అనుమతి లభించినా... కొంతకాలంపాటు ఆంక్షలు కొనసాగే ఆస్కారం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పూర్వస్థాయిలో భక్తులు వచ్చేందుకు సమయం పట్టే అవకాశం ఉన్న కారణంగా.. ఆదాయం మరింత నష్టపోవాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి:

క్షౌరవృత్తిదారుల కడుపుకొట్టిన కరోనా

ABOUT THE AUTHOR

...view details