ఈ నెల 30నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సేవ ప్రారంభమైంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహిస్తున్నారు. ఆనందనిలయం, బంగారువాకిలి, పడికావళి... మందిరంలోని ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజాసామాగ్రి తదితర వస్తువులను అర్చకులు, తితిదే సిబ్బంది శుభ్రం చేస్తున్నారు.
తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం - koial_alwar_tirumanjanam_ttd
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 30నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహించనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు .
శుద్ధి పూర్తయిన తరువాత... నాముకోపు, శ్రీ చుర్ణం, కస్తూరి, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కిచీలీగడ్డ తదితర సుగంధం ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయంతటా ప్రోక్షణం చేస్తున్నారు. ఆలయ శుద్ధి కారణంగా మధ్యాహ్నం వరకు భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేశారు. ఆలయ శుద్ధి చేసిన అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పించి.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభించనున్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని పురస్కరించుకుని మంగళవారం శ్రీవారికి నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవను రద్దు చేశారు.