ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో గందరగోళం - చిత్తూరు జిల్లాలో ఇంటర్​ ఆన్​లైన్​​ ప్రవేశాలు తాజా వార్తలు

ఇంటర్‌ విద్యపై ప్రభుత్వం చేస్తున్న ప్రయోగాలు వికటిస్తున్నాయి. ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రక్రియలో చోటుచేసుకుంటున్న మార్పులు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కోరుకున్న కళాశాలలు కనిపించకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. ఆన్‌లైన్‌ ప్రవేశాల గడువు ఈనెల 29తో ముగుస్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

chittoor district parents are in confusion for inter online admissions
ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు

By

Published : Oct 24, 2020, 6:20 PM IST

చిత్తూరు జిల్లాలో 65 ప్రభుత్వ, 166 ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు అధికారికంగా ఉన్నాయి. అనధికారికంగా మరో 30 కళాశాలలు నడుస్తున్నట్లు సమాచారం. కానీ ఇంటర్‌ ప్రవేశాల కోసం వెబ్‌సైట్‌లో ప్రభుత్వ కళాశాలలు అన్నింటిని అనుమతించగా.. తొలి రోజు 32 ప్రైవేటు కళాశాలల్ని మాత్రమే అనుమతించారు. రెండో రోజైన గురువారం మరో 50 ప్రైవేటు కళాశాలలను ప్రవేశాలకు అనుమతిస్తూ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఇలా రోజుకో జాబితా విడుదల చేయడంతో ఆంతర్యమిటనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు తేదీ ఈనెల 29 వరకు ఎదురుచూస్తేగాని కళాశాలలపై స్పష్టత వచ్చే అవకాశంలేదని తెలుస్తోంది.

దాగుడుమూతలు ఎందుకు..?

ఇంటర్‌ ప్రవేశాల నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు ఆగస్టులో ఆరు బృందాలను (ఒక్కో బృందానికి ముగ్గురు సభ్యులు) జిల్లాకు పంపింది. ప్రతి కళాశాల భవనం, ప్రయోగశాలలు, క్రీడా మైదానాలు, అగ్నిమాపక అనుమతులు, పారిశుద్ధ్య నిర్వహణ సౌకర్యాలు, తాగునీరు తదితర 25 రకాల వసతులను బృందాలు పరిశీలించి జియో ట్యాగింగ్‌ చేసింది. ఈ బృందాలు ఇచ్చిన నివేదిక ఆధారంగా అన్ని సౌకర్యాలు ఉన్న 32 ప్రైవేటు కళాశాలలను తొలుత ప్రవేశాలకు అనుమతించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి వీటిలో 50 శాతం కనీస సౌకర్యాలు లేని కళాశాలలే అని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో, పలుకుబడి ఉన్న మరిన్ని కళాశాలల్లో ప్రవేశాలకు అనుమతిస్తూ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు సమాచారం. ప్రస్తుతం అనుమతించిన కళాశాలల్లో కొన్నింటిని పరిశీలిస్తే వాటిలో చిరునామా లేని, కనీసం పార్కింగ్‌ సౌకర్యం, అంబులెన్స్‌ వెళ్లేందుకు దారిలేని కళాశాలలు చూసి విద్యావేత్తలు విస్తుపోవాల్సి వచ్చింది.

స్పష్టత కోసం ఎదురుచూపులు

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 600 అధ్యాపకులు ఉండగా.. ప్రస్తుతం 120 మంది మాత్రమే శాశ్వత అధ్యాపకులు మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో నాణ్యమైన విద్య సాధ్యం కాదని తల్లిదండ్రులు ప్రైవేటు కళాశాలల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ ఏడాది ఒక్కో కళాశాలలో 360 మంది విద్యార్థులను మాత్రమే అనుమతించాలని, అదనంగా చేర్చుకోవాలంటే మరో కళాశాలకు అనుమతి తీసుకోవాల్సిందే అన్న నిబంధన బోర్డు విధించింది. కొవిడ్‌ కారణంగా పదో తరగతి పరీక్షల్లో అందరూ ఉత్తీర్ణులవ్వడంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 54,000 మంది ఇంటర్‌ ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్నారు. వీరితో పాటు తిరుపతి విద్యా కేంద్రం కావడంతో ఇతర జిల్లాల నుంచి సుమారు ఆరువేల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందే అవకాశం ఉంది.

ఫిర్యాదులు వస్తున్నాయి

ఆన్‌లైన్‌ విధానంలో ప్రారంభమైన అడ్మిషన్ల దరఖాస్తు ప్రక్రియలో జిల్లా వ్యాప్తంగా కళాశాలల జాబితా చూపించడం లేదని పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు. మా దృష్టికి వచ్చిన సమస్యలను బోర్డు దృష్టికి తీసుకెళ్తున్నాం. కళాశాలల్లో వసతులపై తనిఖీ చేసి జియో ట్యాగింగ్‌ చేశారు. అన్ని సౌకర్యాలు ఉన్న కళాశాలలను మాత్రమే విడుదల చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని ఏ కళాశాలలు ఉన్నాయి, లేవు అనే విషయం మాకు తెలియదు. - శ్రీనివాసులరెడ్డి, ఆర్‌ఐవో

ఇదీ చదవండి :

నేటి నుంచి ఇంటర్​ అడ్మిషన్లు.. ఆన్​లైన్​లో దరఖాస్తులు

ABOUT THE AUTHOR

...view details