అటవీ బఫర్ జోన్ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాల ప్రతిపాదనను హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. రిజర్వు అటవీ భూమిలోకి అధికారులు ఎలా ప్రవేశిస్తారని ప్రశ్నించింది. ఇళ్ల స్థలాల పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పింది.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట పంచాయతీ పరిధి నాగపట్ల గ్రామంలో అటవీ బఫర్ జోన్ భూమిలో యథాతథస్థితి పాటించాలని అధికారులను ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కృష్ణమోహన్ తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.