ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తిరుమల: కన్నుల పండువగా రెండో రోజు వైకుంఠ ద్వార దర్శనం

By

Published : Dec 26, 2020, 6:52 PM IST

తిరుమలలో రెండోరోజు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగింది. స్వామివారికి నిత్య కైంకర్యాలను నిర్వహించిన తర్వాత ... భక్తులను దర్శనానికి అనుమతించారు. శుక్రవారం ఏకాదశి రోజున 42 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోగా...4 కోట్ల 39 లక్షల రూపాయలు హుండీ ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.

grandly celebration vaikuntha dhwara dharshanam second day in thirumala
తిరుమలలో కన్నుల పండువగా రెండోరోజు వైకుంఠ ద్వార దర్శనం

తిరుమల శ్రీవారి ఆలయంలో రెండో రోజూ వైకుంఠ ద్వార దర్శనం సందడిగా సాగింది. ద్వాదశిని పురస్కరించుకుని శ్రీవారికి ధనుర్మాస, నిత్య కైంకర్యాలు నిర్వహించిన తర్వాత.. భక్తులను దర్శనానికి అనుమతించారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో పలువురు ప్రముఖులు స్వామిని దర్శించుకున్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా టిక్కెట్లు పొందిన భక్తులు.. ఆలయంలో ఆందోళనకు దిగారు. పదకొండు వేల రూపాయలు చెల్లించి టిక్కెట్లు తీసుకున్న తమను బంగారు వాకిలి నుంచి బలవంతంగా బయటకు లాగేశారని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న అదనపు ఈవో ధర్మారెడ్డి... భక్తులకు నచ్చచెప్పి ఆలయం వెలుపలకి పంపించారు.

ద్వాదశి సందర్భంగా తిరుమలలో చక్రస్నానం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. తిరువీధుల్లో ఊరేగింపుగా చక్రత్తాళ్వారును పల్లకీలో వరాహపుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. తర్వాత సుదర్శన చక్రత్తాళ్వార్లకు వేదమంత్రోచ్ఛారణల మధ్య పుష్కరస్నానం చేయించారు. కరోనా కారణంగా చక్రస్నానానికి భక్తులను అనుమతించలేదు.

జనవరి 3 వరకు వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లు జారీ చేశారని తితిదే అధికారులు వెల్లడించారు. రోజుకు 40 వేల మంది దర్శించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. శుక్రవారం ఏకాదశి రోజున 42 వేల మంది భక్తులకు వైకుంఠ దర్శనం కల్పించామన్నారు. స్వామివారికి 4 కోట్ల 39 లక్షల రూపాయల హుండీ ఆదాయం వచ్చిందని తెలిపారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 282 కరోనా కేసులు, ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details