ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 10, 2021, 12:26 PM IST

ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో వేడెక్కిన పల్లె రాజకీయం

చిత్తూరు జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో... అధికార పార్టీ నేతల బెదిరింపులు... సర్పంచి అభ్యర్థి కిడ్నాప్ వ్యవహారాలు వంటి సంఘటనలతో పల్లె పోరు వేడెక్కింది.

chittoor panchayati elections
చిత్తూరు జిల్లాలో వేడెక్కిన పల్లె రాజకీయం

తొలి దశ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ నేతలు విపక్ష పార్టీ సర్పంచి అభ్యర్థులు, నేతలపై బెదిరింపులకు పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా వడమాలపేట మండలంలో అభ్యర్థి కిడ్నాప్‌ వ్యవహారం సంచలనం సృష్టించింది. మాంబేడులో అధికార పార్టీ నేతలు విపక్ష పోలింగ్‌ ఏజెంటుతోపాటు సర్పంచిగా పోటీ చేస్తున్న అభ్యర్థిపైనే చేయి చేసుకున్నారు. రామచంద్రాపురం మండలం కమ్మ కండ్రిగలో పోలింగ్‌ చీటీల వివాదం.. దొంగ ఓట్ల వ్యవహారం చోటు చేసుకుంది.

వడమాలపేట మండలం ఎల్‌ఎం కండ్రిగ పంచాయతీ పరిధిలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మునిరాజా తెదేపా మద్దతుదారుగా ఉన్నారు. 6వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారంటూ ఆయన మామ సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మునిరాజాకు ఫోన్‌ చేయగా తాను ఎక్కడికీ వెళ్లలేదని ఉదయం వస్తానని చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాడు. తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని ధర్మయ్యపై పోటీ చేయలేకనే తాను మానసికంగా కుంగిపోయి వెళ్లిపోయినట్లు చెబుతున్నాడు. అతని భార్య జ్యోతి మాత్రం తన భర్తను కిడ్నాప్‌ చేసి బెదిరించారని ఆరోపించారు.

*వెదురుకుప్పం మండలం మాంబేడులో వైపాకా మద్దతుదారులు తమపై దాడి చేశారని విపక్షాల మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు కన్నీటి పర్యంతమయ్యారు. మాంబేడు పంచాయతీ పరిధిలోని 9, 10 వార్డుల్లో ఏజెంటుగా ఉన్న హేమశేఖర్‌ను చొక్కా పట్టుకుని బయటకు ఈడ్చుకు వచ్చారని వాపోయారు.

ఓట్లు వేసేందుకు లోపలికి వస్తున్న ఓటర్లను అక్కడే నిలిపివేసి బలవంతంగా ఓటు వేయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై పీవోను అడుగుతున్న సమయంలోనే తనను పలుమార్లు మందలించారని హేమశేఖర్‌ పేర్కొన్నారు. ఇది అన్యాయమని తాను ప్రశ్నించినందుకు చొక్కా చించి బయటికి గెంటి వేశారని ఆరోపించారు.

అధికార పార్టీ నేతలు తనపై దాడి చేశారని సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రత్నమ్మ ఆరోపించారు. అక్కడే ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోలేదన్నారు. ఈ విషయాన్ని ఎస్పై దృష్టికి తీసుకెళ్లేందుకు పలుమార్లు ఫోన్‌ చేసినా కనీసం స్పందించలేదన్నారు. దీంతో ఆమెతోపాటు సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మునస్వామి, మద్దతుదారులు అందరూ వెదురుకుప్పం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. ఎస్సై అక్కడి నుంచి వెళ్లిపోయారని బాధితులు పేర్కొన్నారు. దాంతో పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే బాధితులు ఆందోళన చేశారు. తమకు రక్షణ లేదని వాళ్లు చంపే కంటే తాము చచ్చిపోతామని కన్నీటిపర్యంతమయ్యారు. కొద్దిసేపు పోలింగ్‌ను నిలిపివేసిన అధికారులు ఆ తర్వాత ప్రారంభించారు.

●కమ్మ కండ్రిగలో అభ్యర్థుల ఆందోళన

రామచంద్రాపురం మండలం కమ్మ కండ్రిగలో సర్పంచి అభ్యర్థుల ఆందోళన చేపట్టారు. ఉదయం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే అధికార పార్టీకి చెందిన మద్దతుదారులు ఓటరు చీటీలపై గుర్తులు రాసి పంపిస్తున్నారంటూ తెదేపా మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ మద్దతు గుర్తులు వేసి పంపిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ విషయమై రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశామని, అయినా గుర్తులు రాసిన స్లిప్పులు వస్తూనే ఉన్నాయని సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనార్దన్‌ చౌదరి పేర్కొన్నారు. ఈ వ్యవహారం సద్దుమణగక ముందే మరో వివాదం తలెత్తింది. అధికార వైకాపా నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ విపక్ష సర్పంచి అభ్యర్థులు పోలింగ్‌ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ఒకే ఓటరును రెండు మూడుసార్లు పంపిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ ఘటనపై రేణిగుంట డీఎస్పీతో సర్పంచి అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు. పోలింగ్‌ కేంద్రంలోకి బయటి వ్యక్తులు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. ముగ్గురు అనుమానితులను పట్టించినా పోలీసులు వారిపై చర్యలు తీసుకోలేదని వాపోయారు.

● అందరి సహకారంతో విజయవంతం

అందరి సహకారంతో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతమైనట్లు కలెక్టర్‌ హరి నారాయణన్‌, ఎస్పీ సెంథిల్‌కుమార్‌ తెలిపారు. ఎస్‌ఈసీ నిబంధనల మేరకు పోలింగ్‌ ప్రక్రియను నిర్వహించడంలో కృషిచేసిన అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారని ఎస్పీ తెలిపారు. ఊరేగింపులు, సభలు, బాణసంచా కాల్చడం నిషేధమన్నారు. 30 పోలీస్‌ యాక్ట్‌, 144 సెక్షన్‌ అమల్లో ఉంటాయని ఎస్పీ వివరించారు.

●బ్యాలెట్‌ బాక్సులో నీళ్లు పోసేందుకు యత్నం

ఎస్‌ఆర్‌పురం పరిధిలోని కొత్తపల్లిమిట్ట పంచాయతీలో సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థి బ్యాలెట్‌ బాక్సులో నీళ్లు పోసేందుకు ప్రయత్నించగా వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అడ్డుకున్నారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపు పోలింగ్‌ను నిలిపేశారు. అధికారులు తిరిగి ప్రారంభించారు.

  • డిక్లరేషన్‌ వివాదం

పూతలపట్టు మండల పరిధిలోని పంటపల్లి నాల్గో వార్డు ఓట్లు లెక్కించకుండానే ఐదో వార్డు చేపట్టారు. నాల్గో వార్డు అభ్యర్థికి డిక్లరేషన్‌ ఇచ్చారు. దీనిపై అభ్యంతరాలు రావడంతో డిక్లరేషన్‌ను పక్కనబెట్టారు. తవణంపల్లె పరిధిలోని తెల్లగుంట్లపల్లెలో వృద్ధ మహిళ ఓటు వేసేందుకు రాగా అధికార పార్టీకి చెందిన కొందరు అభ్యంతరం తెలిపారు. పోలింగ్‌ అధికారులు ఆమె ఇప్పుడే వచ్చిందని స్పష్టం చేశారు. ఆమె తిరిగి ఓటరు కార్డు తెచ్చుకుని ఓటు వేశారు.

ఇదీ చదవండి:చిత్తూరు జిల్లా... పంచాయతీ ఎన్నికల ఫలితాలు

ABOUT THE AUTHOR

...view details