ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా సర్కారుకు కౌంట్‌డౌన్‌ మొదలైంది: చంద్రబాబు

తెదేపా అధికారంలో ఉన్నంత కాలం శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇచ్చామని... ఆ పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో ఆయన రెండోరోజు పర్యటించారు. చంద్రగిరి మండలం ఐతేపల్లెలో... వైకాపా బాధితులతో చంద్రబాబు సమావేశమయ్యారు. వైకాపా వేధింపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చాక వైకాపా నేతలు... వారిని ప్రోత్సహిస్తున్న అధికారులు మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు.

By

Published : Nov 8, 2019, 6:24 AM IST

వైకాపా సర్కారుకు కౌంట్‌డౌన్‌ మొదలైంది: చంద్రబాబు

వైకాపా సర్కారుకు కౌంట్‌డౌన్‌ మొదలైంది: చంద్రబాబు

గంగాధర నెల్లూరు పరిధిలో పంట పొలాల ధ్వంసం... చంద్రగిరి నియోజకవర్గంలో అక్రమ కేసులు... తంబళ్లపల్లె ఏరియాలో హత్యకు గురైన కుటుంబంపై ఎదురు కేసులు... పుంగనూరులో తెదేపా కార్యకర్త ఇంటి ముందు గొయ్యితవ్వి వేధింపులు... ఇలా చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ ఆవేదనను... అధినేత చంద్రబాబుకు వివరించారు.

చిత్తూరు జిల్లా రెండోరోజు పర్యటనలో ఉన్న చంద్రబాబు... వైకాపా బాధితులతో సమావేశమయ్యారు. సమస్యలను వారి ద్వారానే చెప్పించారు. తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని పెద్దతిప్పసముద్రం మండలం పులికల్లులో... హత్యకు గురైన గంగిరెడ్డి కుటంబ సభ్యులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు చంద్రబాబుకు వివరించారు. తమపై ఎదురు కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు. చంద్రగిరి నియోజకవర్గం కమ్మపల్లె గ్రామం నుంచి వచ్చిన కార్యకర్తలు... తమపై రౌడీషీట్ తెరిచారని వివరించారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే వేధింపులకు గురిచేస్తున్నారని... తిరుపతి నగరానికి చెందిన కార్యకర్త మధు చంద్రబాబుకు వివరించారు. తప్పుడు కేసులకు భయపడి 4 నెలలుగా తన కుటుంబానికి దూరంగా బతకాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీపై అభిమానంతో తన కొడుక్కు అధినేత పేరు పెట్టుకున్నట్లు చంద్రబాబుకు వివరించారు. తన కొడుకుతో చంద్రబాబుపై పాట పాడించారు.

వైకాపా అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా... 83 మందిపై 39 అక్రమ కేసులు బనాయించిందని చంద్రబాబు ఆరోపించారు. సీమలో చిత్తూరు జిల్లాకు ప్రత్యేకత ఉందని... శాంతియుతమైన జిల్లాను కక్షలకు కేంద్రంగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తంబల్లపల్లిలో కార్యకర్త గంగిరెడ్డిని హత్య చేసి, తిరిగి ఆయన కుటుంబంపై కేసులు పెట్టారన్నారు. గంగిరెడ్డి కుటుంబానికి రూ.2లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన చంద్రబాబు... గంగిరెడ్డి కూతురును ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తామని హామీఇచ్చారు.

తెదేపా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టే పోలీసులపై... ప్రైవేటు కేసులు పెడతామని హెచ్చరించారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వారు కొంత కాలం తర్వాత అదే స్థానంలో ఉండరని... బాధితులు అధికారంలోకి వస్తే ఏమవుతుందో గుర్తుపెట్టుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులతో సమావేశం అనంతరం నియోజకవర్గాల వారీగా శ్రేణులతో భేటీ అయ్యారు. పార్టీ అంశాలపై చర్చించారు.

ఇదీ చదవండీ... అక్రమ కేసులను సమర్థంగా ఎదుర్కొంటాం: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details