Chandrababu Fires on Jagan: సీఎం జగన్ బ్రిటిష్ వాళ్ల కంటే ఘోరంగా తయారయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. 3 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా నియోజకవర్గానికి వస్తున్న ఆయనను ఏపీ సరిహద్దులో బాదూరువద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు నడిరోడ్డుపైనే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తనను ఏ చట్టం ప్రకారం అడ్డుకుంటున్నారో స్పష్టతివ్వాలని పోలీసులను ప్రశ్నించారు.
సీఎంకు నిబంధన వర్తించదా?
‘ఇది నా సొంత నియోజకవర్గం. ఇక్కడి నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. గత నెలలోనే కుప్పం నియోజకవర్గానికి వస్తానని డీజీపీకి సమాచారమిచ్చా. ఈ నెల 2న ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చింది. దాని ప్రకారం నేను ఎక్కడా రోడ్షో పెట్టకూడదంటున్నారు. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీ రహదారుల్లో రోడ్షోలు పెట్టకూడదని ప్రభుత్వం కొత్తగా జీవో తీసుకొచ్చింది. సీఎం దయాదాక్షిణ్యాలతో సమావేశాలు పెట్టుకోవాలని పోలీసులు నిబంధన తెచ్చారు. అదే సీఎం నిన్న సమావేశం పెట్టినప్పుడు స్కూళ్లకు సెలవిచ్చారు. ఆర్టీసీ, ప్రైవేటు, స్కూలు బస్సులన్నీ తీసుకున్నారు. డ్వాక్రా మహిళలు రాకుంటే పింఛను, రేషన్ తొలగిస్తామని ఇబ్బందులు పెట్టారు. కానీ టీడీపీ కార్యక్రమాలకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. జగన్ పని అయిపోయిందని ప్రజల్లో స్పష్టమైన అవగాహన వచ్చింది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
అమల్లో లేని చట్టం
1861వ చట్టం ప్రకారం పోలీస్ యాక్ట్ 30 తీసుకొచ్చామని చెబుతున్నారు. దానిపై ఉత్తర్వులిచ్చారు. జీవో 1ని ఏ చట్టం ప్రకారం తీసుకొచ్చారు? 1861 చట్టప్రకారం అయితే అందులోని 46వ నిబంధన ప్రకారం మద్రాస్ ప్రెసిడెన్సీలో ఇది వర్తించదు. ఇప్పటికే ఒక చట్టం ఉంది. ఈ చట్టాన్ని స్వీకరించాలంటే గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఈ చట్టాన్ని ఎప్పుడు స్వీకరించారో చెప్పాలి. ఒకవేళ ఇప్పటికే చట్టం అమల్లో ఉంటే కొత్తగా జీవో ఎందుకు? చట్టం అమల్లో లేకుంటే జీవో దేని ప్రకారం తీసుకొచ్చారు’ చెప్పాలని చంద్రబాబు నిలదీశారు.
2న జీవో.. 1 నుంచి అమలా?: ‘రోడ్లపై సభలు, సమావేశాలు వద్దని 2న ప్రభుత్వం జీవో ఇచ్చింది. 1 నుంచి యాక్ట్ 30 అమల్లో ఉందని పలమనేరు డీఎస్పీ నోటీసిచ్చారు. 2వ తేదీన జీవో ఇస్తే 1 నుంచే అమలు చేశారంటే ఈ డీజీపీ ఎంత సమర్థుడో అర్థమవుతోంది’ అని మండిపడ్డారు.
ఎమర్జెన్సీ విధించాలనుకుంటున్నారా?
‘జగన్మోహన్రెడ్డీ.. ఆంధ్రప్రదేశ్లో చీకటి జీవోలతో ఎమర్జెన్సీ విధించాలనుకుంటున్నారా? కుప్పం నా నియోజకవర్గం. మీలాంటి వాళ్లు వేల జన్మలు ఎత్తినా కుప్పం ప్రజల గుండెల్లో ఉండేది టీడీపీనే. సమావేశాలు పెట్టుకోవడానికి వీల్లేదు. మైకులకు, రోడ్షోలకు అనుమతివ్వం.. గ్రామాలకు రాకూడదు.. ఎవరినీ కలవకూడదని అంటున్నారు.. అదే రాసివ్వాలని డీఎస్పీని కోరాను. ఆయన రాసిచ్చిన తర్వాతే ఇక్కడి నుంచి కదులుతాను. అయ్యా, డీఎస్పీ.. నేను జగన్మోహన్రెడ్డిలా చట్ట వ్యతిరేకంగా వెళ్లను. హత్యా, గూండా రాజకీయాలు చేయను. హుందాగా, ప్రజల కోసం రాజకీయం చేస్తాను. మీరు నన్ను ప్రజలను కలవనివ్వకుండా చేయాలని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నా దగ్గర సాగదు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పనికిమాలిన దద్దమ్మ, ఒక సైకో ముఖ్యమంత్రిని మొదటిసారి చూస్తున్నా. కుప్పం నియోజకవర్గాన్ని దోచుకుంటూ రౌడీలను ప్రోత్సహించారు’ అని తీవ్రస్థాయిలో విమర్శించారు.
కాలినడకనే గ్రామాల్లో తిరిగిన చంద్రబాబు
ప్రచార రథాన్ని తెప్పించడానికి పోలీసులు అంగీకరించకపోవడంతో చంద్రబాబు పెద్దూరు గ్రామంలో సుమారు 20 నిమిషాలపాటు కాలినడకన తిరిగారు. ప్రజలు, కార్యకర్తలతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత మిగిలిన పల్లెలకూ కారులో వెళ్లారు. షెడ్యూల్లోని బెండనకుప్పం, గొల్లపల్లె క్రాస్, శివకురుబూరు, తదితర గ్రామాల్లోని వీధుల్లో కాలి నడకనే పర్యటించారు.
కుప్పం.. నా సొంత నియోజకవర్గం. కుప్పంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. కుప్పం పర్యటనపై పోలీసులకు ముందే సమాచారం ఇచ్చాం. నా రోడ్షో అడ్డుకునేందుకే కొత్త జీవో ఇచ్చారు. నేనెక్కడా రోడ్షో పెట్టకుండా ఉండాలని ప్రభుత్వ ప్రయత్నం చేస్తోంది. పోలీసుల దయాదాక్షిణ్యాలతో సభలు పెట్టుకునేలా ఉత్తర్వులు ఇచ్చారు. నిన్న సీఎం జగన్ కూడా సభ నిర్వహించారు. జగన్ సభ కోసం విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు జగన్ పనైపోయిందని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చారు. అందుకే నా సభలకు తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు. మేం ఇలాంటి ఆంక్షలు పెట్టివుంటే జగన్ పాదయాత్ర చేసేవారా?. నా ప్రజలను నేను కలవకూడదా?-చంద్రబాబు, టీడీపీ అధినేత