చిత్తూరు జిల్లా శాంతిపురం మండల పరిధి చిన్నూరు-సోమపురం సమీపంలోని చెలమవంక గుట్ట క్వారీలో బుధవారం జరిగిన పేలుళ్లలో ఓ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. క్వారీలో రాతిగుట్టలను పెకిలించేందుకు కార్మికులు పేలుళ్లు జరపగా బండలు పగిలి మీద పడటంతో గోవిందు (46) అనే కార్మికుడు తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలో మృతి చెందాడు.
ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. మృతుడి స్వగ్రామం గుడుపల్లె మండలంలోని కేజీకొటాలు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. బెంగుళూరులో కూలి పని చేసుకునే గోవిందు.. కొవిడ్ లాక్డౌన్లో స్వగ్రామానికి వచ్చి ఇక్కడే క్వారీలో పని చేస్తున్నాడు. గ్రామీణ సీఐ యతీంద్ర, ఎస్సై లక్ష్మీరెడ్డి, సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. క్వారీకి అనుమతి లేదని విచారణలో తేలినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే క్వారీకి చెందిన వ్యక్తులు యంత్రాలు, సామగ్రితో పరారైనట్లు స్థానికులు పేర్కొన్నారు.