ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వామ్మో ఫొని.. వెళ్తూ వెళ్తూ మంట పెట్టింది!

By

Published : May 6, 2019, 5:32 PM IST

Updated : May 6, 2019, 7:30 PM IST

మెున్నటి వరకు తీర ప్రాంతాన్ని గజగజ వణికించిన తుపాను ఫొని ప్రభావం ముగియగానే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రత తీవ్రత పెరిగిపోయింది. పశ్చిమ, వాయువ్య ప్రాంతాలను నుంచి వీస్తున్న ఉష్ణగాలుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతం నిప్పుల కొలిమిలా మారిపోయింది. తుపాను వెళ్తూ తేమగాలులను తీసుకెళ్లిన కారణంగా.. ఆ ప్రదేశాన్ని వాయవ్య దిశ నుంచి వీస్తున్న వేడిగాలులు భర్తీ చేసినట్లు వాతావరణశాఖ తేల్చింది.

వామ్మో...ఫొని వెళ్తూ...వెళ్తూ...మంట పెట్టింది!

రాష్ట్ర వ్యాప్తంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 45 డిగ్రీలుగా నమోదు అవుతున్నాయి. మే 10 వరకు పరిస్థితి ఇలానే ఉంటుందని అధికారులు తేల్చి చెబుతున్నారు.

ఇబ్రహీంపట్నంలో అత్యధికం

వాయువ్య భారత్​లోని రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ మహారాష్ట్రలోని విదర్భ మీదుగా వీస్తున్న ఉష్ణగాలులు కోస్తాంధ్ర తీరప్రాంతాన్ని నిప్పుల కొలిమిలా మారుస్తున్నాయి. తుపాను ఫొని ఈ ప్రాంతంలోని తేమగాలులను ఈడ్చుకుని పోవటంతో ఆ ప్రాంతాన్ని వాయవ్యం నుంచి వస్తున్న వేడిగాలులు భర్తీ చేశాయి. ప్రస్తుతం కోస్తాంధ్రలోని తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు ప్రకాశం జిల్లాల్లో 43 నుంచి 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా 46.78 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లాలోని యర్రగొండెపాలెంలో 46.78 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

సాధారణం కంటే ఎక్కువే..!

రాష్ట్రవ్యాప్తంగా 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు 405కు పైగానే ఉన్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ, రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రాలు వెల్లడించాయి. ఇవాళ 14 మండలాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 57 మండలాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. 210 మండ‌ల్లాల్లో వ‌డ‌గాల్పుల ప్రమాదం ఉన్నట్లు ఆర్టీజీఎస్‌ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర పెరిగిపోయాయని ఐఎండీ స్పష్టం చేసింది.

Last Updated : May 6, 2019, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details