ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ గురించి అందరికీ తెలిసిందేగా.. మహా డేంజర్మ్యాన్. అగ్రరాజ్యాల కళ్లుగప్పి.. అణుపరీక్షలు జరిపిస్తుంటాడు.. గుట్టుచప్పుడు కాకుండా.. గూఢచారులను మట్టుబెట్టిస్తుంటాడు... అలాంటి వ్యక్తి.. ఎప్పుడు చూసినా రాజధాని ప్యాంగ్ యాంగ్లో విలాసవంతమైన బెంజ్ లిమోసిన్ , రోల్స్రాయిస్ వంటి కార్లలో కనిపిస్తుంటాడు.. ఆ ఫోటోలు చూసి.. పాశ్చాత్య నిఘా సంస్థలు ఖంగుతినేవి.. దాదాపు అన్నీ దేశాలతో తగువులున్న ఉత్తరకొరియా మీద ఆంక్షలు ఎక్కువ..! అయినా ఇంత విలాసవంతమైన కార్లు కొరియాకు ఎలా వచ్చాయన్నది ఎవరికీ అంతుబట్టేది కాదు. దీంతో అమెరికాకు చెందిన ది సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ స్టడీస్ అనే ఒక సంస్థ పరిశోధన చేపట్టింది. ఈ పరిశోధనలో కిమ్కు కార్లను తరలించడం వెనుక ప్రపంచ స్థాయిలో పెద్ద నెట్వర్కే పనిచేసిందది తేలింది.
సముద్రాలను దాటి ..
కిమ్కు చేరాల్సిన రెండు మెర్సిడెస్ కార్లను 2018 జూన్ 14వ తేదీన రెండు కంటైనర్లలో లోడ్చేసి వాటికి సీల్ వేసి ట్రక్కుల్లో నెదర్లాండ్స్లోని రోటర్డామ్ ఓడరేవుకు చేర్చారు. వీటి విలువ 5లక్షల డాలర్లు ఉంటుంది. ఈ కార్లు చైనాకు చెందిన ఓ షిప్పింగ్ కార్పొరేషన్ కస్టడీలో ఉన్నాయి. తొలుత ఈ కార్లను ఎవరి పేరుతో కొన్నారో తెలియలేదు. రోటర్డామ్ నుంచి బయల్దేరిన ఆ కార్గో షిప్ 41రోజుల తర్వాత జులై 31న చైనాలోని దలియన్ ఓడరేవుకు చేరింది. అక్కడ ఆ కంటైనర్లను దించేశారు. అవి ఆగస్టు 26వరకు ఆ పోర్టులోనే ఉండిపోయాయి. జపాన్లోని ఒసాక వెళ్లే ఒక షిప్లో వాటిని లోడ్ చేశారు. సెప్టెంబర్ 18 నాటికి ఒసాక చేరిన ఈ కంటైనర్లను బుసాన్ వెళ్లే మరో ఓడలో ఎక్కించారు. సెప్టెంబర్ 30న ఇవి దక్షిణకొరియాలోని బుసాన్ ఓడరేవును చేరాయి.
అక్కడే అసలు మతలబు..
ఉత్తర ఆఫ్రికా దేశమైన టోగో పతాకంతో ఉన్న డీఎన్5505 ఓడ బుసాన్లో ఈ కంటైనర్లను ఎక్కించుకొని రష్యాలోని వ్లాదివాస్తోక్ వద్ద నఖోద్క ఓడరేవు దిశగా బయల్దేరింది. ఉత్తరకొరియాకు వెళ్లే స్మగ్లింగ్ వస్తువులకు ఈ ప్రాంతం గడప వంటింది. అక్టోబర్ 1వ తేదీన ఈ షిప్ ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ వ్యవస్థను నిలిపివేశారు. ఆంక్షలను ఉల్లంఘించడానికి నౌకలు సాధారణంగా ఇదే పనిచేస్తాయి. 18 రోజుల తర్వాత దక్షిణ కొరియా సముద్ర జల్లాల్లో ఈ ఓడ సిగ్నల్స్ మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. ఆ సమయంలో దానిలో 2,588 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉంది. దీనిని దక్షిణ కొరియాలోని ఫాంగ్ నౌకాశ్రయంలో అన్లోడ్ చేసింది. రష్యా నుంచి ఈ బొగ్గును తెచ్చినట్లు చూపించారు.