ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐపీఎస్​ల బదిలీపై.. ఈసీతో ప్రత్యక్ష పోరు!

రాష్ట్రంలో  ఐపీఎస్‌ల బదిలీ... రాజకీయ దుమారాన్ని రేపుతోంది.  నిఘా విభాగాధిపతి సహా ఇద్దరు ఎస్పీలను ఎన్నికల సంఘం  బదిలీ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... రాజ్యాంగ సంస్థనే ఢీ కొట్టేందుకు సమాయత్తమైంది.

By

Published : Mar 27, 2019, 6:24 PM IST

ఈసీతో ప్రత్యక్ష పోరు

రాష్ట్రంలో ఐపీఎస్‌ల బదిలీ... రాజకీయ దుమారాన్ని రేపుతోంది. నిఘా విభాగాధిపతి సహా ఇద్దరు ఎస్పీలను ఎన్నికల సంఘం బదిలీ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... రాజ్యాంగ సంస్థనే ఢీ కొట్టేందుకు సమాయత్తమైంది. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ... నేరుగా ఈసీతోనే తలపడుతోంది. ఈసీ ఇచ్చిన ఆదేశాలను కాదని కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం బదిలీ చేసిన ఇంటెలిజెన్స్‌ డీజీని.. విధుల నుంచి రిలీవ్ చేసేందుకు నిరాకరించింది. మరోవైపు ఈసీ నిర్ణయంపై హైకోర్టు తలుపునూ తట్టింది.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారం ఎంతజోరుగా సాగుతోందో... అంతే స్థాయిలో వివాదాల హోరూ పెరుగుతోంది. 15 రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా ఫారం-7 దరఖాస్తులపై వివాదం తలెత్తితే... ఇప్పుడు ఐపీఎస్‌ బదిలీలవ్యవహారంతో మరింత వేడెక్కింది. ప్రతిపక్షం ఆరోపణలతోముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీచేయాలని ఈసీ ఆదేశించింది.

ఈసీ ఆదేశాల మేరకు... కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం... ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును మాత్రం రిలీవ్‌ చేసేందుకు నిరాకరించింది. ఆయన స్థాన చలనంపై... ఈసీ ఇచ్చిన ఉత్తర్వులు నిలిపివేసింది. నిబంధనల ప్రకారం ఇంటెలిజెన్స్ డీజీ ఈసీ పరిధిలోకి రానందున బదిలీ నిలిపివేసినట్టు తేల్చి చెప్పింది. కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేస్తూ సీఎస్‌ కొత్త జీవో ఇచ్చారు.

అంతకు ముందు.. చంద్రబాబు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల దృష్ట్యా... డీజీపీ, పోలీసు యంత్రాంగాన్ని సీఈసీ పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో... ఇంటెలిజెన్స్ డీజీకి మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం... డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకూ ఎన్నికల సంఘం పరిధిలోకి తీసుకొచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం... ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ సీఈసీ పరిధిలోనే పోలీసు యంత్రాంగం పనిచేయనుంది. ఈసీ నిబంధనల మేరకే తాజా ఉత్తర్వులు ఇచ్చామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈసీతో తాడో పేడో
స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం... మోదీ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందని రాష్ట్రప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇదే విషయంపై న్యాయస్థానంలో పోరాటం చేస్తోంది. ఐపీఎస్‌ల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం .. హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేసింది. గట్టిగానే వాదనలు వినిపించింది. ఎన్నికల విధుల్లో ఇంటెలిజెన్స్‌ డీజీ లేరన్న పత్రాన్ని సమర్పించాలన్న ధర్మాసనం... ఆధారాలతో ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. మే 27 వరకు పోలీసు అధికారులంతా ఈసీ పరిధిలోనే ఉంటారని కోర్టుకు తెలిపారు. అనంతరం పిటిషన్‌ విచారణ రేపటికి వాయిదా పడింది.

ఐపీఎస్‌లపై ఫిర్యాదు చేసి బదిలీలకు కారణమైన వైకాపా.... ఈ కేసులో జోక్యానికి అభ్యర్థించింది. తమనూ ఇంప్లీడ్‌ చేయాలని కోర్టు అనుమతి కోరింది. దీనిపై వాదనలు తర్వాత వింటామని హైకోర్టు సమాధానం చెప్పింది.

రాష్ట్రంలో కొందరు ఐపీఎస్‌లు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని 2రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘానికి వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి బృందం ఫిర్యాదు చేసింది. కొందరు అధికారులపైనా తీవ్రస్థాయిలో ఆరోపణలూ చేశారు.

వైకాపా ఫిర్యాదు చేసి 24 గంటల్లోపే ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఎవరెవరిపై ఫిర్యాదు అందిందో వారందర్నీ బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ జాబితాలో రాష్ట్ర నిఘా విభాగాధిపతి ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మను విధుల నుంచి తప్పించారు. వారి స్థానంలో వేరే వారికి బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఆకస్మిక చర్య ప్రభుత్వ వర్గాలను విస్మయానికి గురి చేసింది. ఎన్నికల విధుల్లో లేని నిఘా విభాగం అధిపతిని బదిలీ చేశారని ప్రభుత్వాన్ని ఎలాంటి వివరణ అడగకుండానే అధికారులపై చర్యలు తీసుకోవడం మేంటని ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

ఈసీ చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుపట్టారు. ఈసీ పక్షపాతధోరణితో వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం చెప్పినట్లే పనిచేస్తోందని ఆరోపించారు. ఈ దుందుకుడు చర్యలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇది చెప్పిన వెంటనే కోర్టులో పిటిషన్ వేశారు. వెంకటేశ్వరరావు బదిలీని నిలిపివేస్తూ ఉత్తర్వులూ జారీ చేశారు.

ఇటీవలే నకిలీ పేర్లతో దరఖాస్తు చేసి ఓట్లు తొలగించే వికృత క్రీడ మొదలైందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఆ పాచిక పారలేదని... ఇప్పుడు మరోదారిలో కుట్రలకు తెరలేపారని నేతలు మండిపడుతున్నారు. ప్రజల దృష్టి మరల్చి... అల్లకల్లోలం సృష్టించే కుయుక్తులు సాగుతున్నాయని విమర్శిస్తున్నారు.

రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలను కేంద్రం ఉసిగొల్పుతోందని ఆరోపించిన ప్రభుత్వం.. ఆ సంస్థకు సహాయ నిరాకరణ చేపట్టింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమైంది. అప్పట్లో చంద్రబాబు దారిలోనే మమత సహా చాలా మంది ముఖ్య మంత్రులు నడిచారు. తమ రాష్ట్రాల్లోకి సీబీఐ రావద్దని తేల్చి చెప్పేశారు. ఇప్పుడు అదే మాదిరిగా మరో రాజ్యాంగ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సమరం చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details