AP Constable Jobs Preliminary Exam updates: ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నేతృత్వంలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 997 పరీక్ష కేంద్రాల్లో ప్రాథమిక రాత పరీక్ష మొదలైంది. రాత పరీక్ష విషయంలో అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచి అనుమతిస్తామని, 10 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యం అయినా అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు నిబంధన విధించారు. ప్రభుత్వం విధించిన సమయపాలన నిబంధన అభ్యర్థులకు తిప్పలు తెచ్చింది. సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోలేక కొంతమంది అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు.
బాపట్ల జిల్లా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజిలో పరీక్ష రాసేందుకు పాలెం నుంచి బయలుదేరిన భూ లక్ష్మి అనే అభ్యర్థిని కర్లపాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడింది. దీంతో ఆసుపత్రిలో కట్టు కట్టించుకొని 10 గంటల 2నిమిషాలకు పరీక్షా కేంద్రానికి చేరుకుంది. అయితే, పోలీసులు అనుమతి లేదని తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అక్కడకు రాగా.. ఆయనను కూడా అనుమతి ఇవ్వాలని వేడుకొంది. నిబంధనలు పాటించాలని ఎస్పీ చెప్పడంతో పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయింది. మరో ముగ్గురు అభ్యర్థులు సైతం ఈ పరీక్ష కేంద్రానికే ఆలస్యంగా వచ్చి అవకాశాన్ని కోల్పోయారు.