ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జోరందుకున్న 'మునుగోడు' పోలింగ్​.. 5 గంటల వరకు 77 శాతం పోలింగ్ - Munugode By Election Polling

Munugode By poll Voting: మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం మందకొడిగా సాగిన ఓటింగ్.. అనంతరం గంటగంటకూ జోరందుకుంటోంది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించగా.. కాసేపు పోలింగ్‌ నిలిచిపోయింది. మరమ్మతుల అనంతరం యధావిధిగా పోలింగ్‌ కొనసాగుతోంది. పోలింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈసీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లోని ఈసీ కార్యాలయం నుంచి ఈసీ డేగకన్నుతో పోలింగ్‌ సరళిని పర్యవేక్షిస్తోంది. కాసేపట్లో పోలింగ్​ ముగియనుంది.

Munugode By poll Voting
మునుగోడు పోలింగ్​

By

Published : Nov 3, 2022, 1:44 PM IST

Updated : Nov 3, 2022, 5:20 PM IST

Munugode By poll Voting: మునుగోడు నియోజకవర్గంలో ఉపఎన్నిక పోలింగ్‌ జోరందుకుంది. నియోజకవర్గవ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఓటర్లు భారీగా తరలివస్తున్నారు. వృద్ధులు, మహిళలు, యువత ఓటు వేసేందుకు ఉత్సాహంగా తరలివస్తున్నారు. వికలాంగులు, అనారోగ్యం, ప్రమాదాల బారిన పడిన వారు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్, భాజపా నేతలు పోలింగ్ సరళిని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. మునుగోడులో ఉదయం 9 గంటల వరకు 11.2 శాతంగా నమోదైన పోలింగ్.. 11 గంటల వరకు 25.8 శాతం నమోదైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 41.3 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 3 గంటల వరకు పోలింగ్ 60 శాతానికి చేరిందని ఈసీ తెలిపింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్​ 77 శాతానికి చేరుకుంది. 6 గంటల వరకు క్యూలైన్​లో నిల్చున్నవారికి ఓటు వేసే అవకాశమిస్తామని అధికారులు తెలిపారు.

Munugode By Election Polling : పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. పోలింగ్‌ కేంద్రాలకు తమంతట తాము రాలేని పరిస్థితుల్లో ఉన్న వారి కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. కేంద్రాల్లో వైద్య సదుపాయం అందుబాటులో ఉంచారు. ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు నియోజకవర్గవ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాలను సందర్శిస్తూ.. సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. చౌటుప్పల్‌ పోలింగ్ కేంద్రాన్ని కేంద్ర ఎన్నికల పరిశీలకుడు పంకజ్ కుమార్ సందర్శించారు.

మొరాయిస్తున్న ఈవీఎంలు..: పలుచోట్ల ఈవీఎంలు మొరాయించగా.. సిబ్బంది వాటిని సరిచేశారు. కొంపల్లిలోని 145వ బూత్‌లో మొదటి 25 ఓట్లు పోలైన అనంతరం ఈవీఎం మొరాయించింది. ఈవీఎం సమస్యతో.. పోలింగ్‌ గంట పాటు నిలిచిపోయింది. నాంపల్లి మండలం పెద్దాపురం పోలింగ్‌ కేంద్రంలో ఒకటే ఈవీఎం ఉండటంతో పోలింగ్‌కు ఆలస్యమైంది. చిన్నకొండురూలో వీవీ ప్యాట్‌లో సాంకేతిక సమస్య తలెత్తటంతో కొద్దిసేపు పోలింగ్‌ నిలిచిపోగా.. మరమ్మతు అనంతరం తిరిగి కొనసాగుతోంది. ఎస్‌.లింగోటం గ్రామంలో ఈవీఎంలోని బ్యాటరీలో సమస్య రాగా.. మరమ్మతు అనంతరం మళ్లీ కొనసాగించారు. చండూరు మండలం కొండాపురం గ్రామంలో దాదాపు అర గంట పాటు ఈవీఎంలు మొరాయించాయి. దీంతో కేంద్రం ముందు ఓటర్లు బారులు తీరారు. సంస్థాన్ నారాయణపురం మండలం అల్లందేవిచెరువులో ఈవీఎం మొరాయించటంతో 82వ పోలింగ్‌ కేంద్రంలో కాసేపు పోలింగ్‌ నిలిచింది.

ఇవీ చూడండి..

Last Updated : Nov 3, 2022, 5:20 PM IST

ABOUT THE AUTHOR

...view details