TDP National General Secretary Nara Lokesh Padayatra break: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ ఏడాది జనవరి 27వ తేదీన 'యువగళం' పేరుతో చిత్తూరు జిల్లాలో పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. పాదయాత్ర ప్రారంభించిన రోజు నుంచి రాష్ట్ర పోలీసులు లోకేశ్ను అడుగడుగునా అడ్డుకున్నారు. పలు రకాల ఆంక్షలను విధించారు. అయినా కూడా ప్రజల మద్దతుతో, పార్టీ కార్యకర్తల అండదండలతో ఆయన 41 రోజులపాటు తన పాదయాత్రను కొనసాగించారు. 41వ రోజు చేపట్టిన 'యువగళం' పాదయాత్ర నేడు తంబళ్లపల్లె నియోజకవర్గంలో ముగిసింది. ఈ క్రమంలో మార్చి 13వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని.. ఎన్నికల సంఘాన్ని, చట్టాలను గౌరవించి తన పాదయాత్రను రెండు రోజుల పాటు తాత్కాలికంగా విరామం ఇస్తున్నానని లోకేశ్ ప్రకటించారు.
'యువగళం' పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్: యువగళం పాదయాత్రకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున.. స్థానికేతరులు ఎన్నికలు జరిగే ప్రాంతంలో ఉండకూడదంటూ అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఆయన పాదయాత్రకు విరామం ఇచ్చారు. దీంతో హైదరాబాద్కు బయలుదేరి వెళ్లిన లోకేశ్.. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన అనంతరం తిరిగి పాదయాత్రలో పాల్గొననున్నారు.
రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేత:మండలి ఎన్నికల నేపథ్యంలో యువగళం పాదయాత్రకు లోకేశ్ రెండు రోజుల తాత్కాలిక విరామం ఇచ్చారు. అన్నమయ్య జిల్లాలో లోకేశ్ పాదయాత్ర నిర్వహిస్తుండగా.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో స్థానికేతరులు జిల్లాలో ఉండకూడదంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు. ఎన్నికల కోడ్ ప్రకారం ఓటర్లు కాని స్థానికేతరులు జిల్లాలో ఉండకూడదని తెలిపారు. లోకేశ్తో పాటు స్థానికులు కాని సిబ్బంది సైతం వెళ్లిపోవాలని సూచించారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు కొంత తర్జనభర్జన పడినా.. చివరకు జిల్లా వీడి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు.
ఎన్నికల సంఘాన్ని, చట్టాన్ని గౌరవిస్తున్నా: అంతకుముందు రెవెన్యూ అధికారుల నోటీసులను లోకేశ్ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించాలని ముందుగానే నిర్ణయించుకున్నందున.. అన్నమయ్య జిల్లాలోనే ఉండేందుకు అనుమతించాలని కోరారు. 2013లో చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇలాంటి మినహాయింపే ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అయితే ఎన్నికల నిబంధనల మేరకు స్థానికేతరులు ఉండటానికి వీలులేదని ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. లోకేశ్ పంపిన విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. అక్కడి నుంచి వచ్చిన సమాధానాన్ని తెలియపరుస్తామని చెప్పడంతో.. ఎన్నికల సంఘాన్ని, చట్టాన్ని గౌరవించి జిల్లా విడిచి వెళ్తున్నట్లు లోకేశ్ తెలిపారు.