Attack on Student: పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నామని దీనికి రావాలని ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆహ్వానించి చితకబాదిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మదనపల్లి పట్టణం రామారావు కాలనీకి చెందిన ఆది రామ్మూర్తి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. గతంలో కొందరు కలిసి ఒక యువకుడ్ని చితకబాదుతుంటే గమనించిన రామ్మూర్తి ఎందుకలా కొడతారని వారించాడు. దీంతో అతనిపై కోపం పెంచుకున్న అయిదుగురు యువకులు రామ్మూర్తిని లక్ష్యంగా చేసుకున్నారు. వీరంతా ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం రామ్మూర్తిని శనివారం జన్మదిన వేడుకలకు రావాలని నమ్మబలికారు.
వారి మాటలను నమ్మి వచ్చిన రామ్మూర్తిని.. తిరుపతి రోడ్డు సీటీఎం సమీపంలోని ఓ ప్రైవేటు పాల డెయిరీ వద్దకు తీసుకెళ్లారు. అయిదుగురు కలిసి విద్యార్థి రామ్మూర్తిని తీవ్రంగా గాయపడేలా చితకబాదారు. కాళ్లు పట్టుకున్న వేడుకున్నా వదలకుండా విచక్షణారహితంగా అందరూ కలిసి కొట్టారు. వారి వద్ద నుంచి తప్పించుకుని వచ్చిన రామూర్తి.. తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. దీంతో వారు భయపడి తమ కుమారుడిని శనివారం బయటకు పంపలేదు. ఆదివారం రాత్రి మదనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ వెళ్లి జరిగిన ఘటన గురించి పోలీసులకు వివరించారు. అయితే పోలీసులు మొదట వీరి ఫిర్యాదును తిరస్కరించారు. అనంతరం సీఐ సత్యనారాయణ వారి వద్ద నుంచి స్వీకరిస్తున్నట్లు తెలిపారు సోమవారం నిందితులను పిలిపించి విచారణ చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారు.