YSRCP Government Negligence on Industries : కియా! కరువు నేలను కార్ల ఉత్పత్తికి చిరునామా మార్చిన అతిపెద్ద ప్రాజెక్టు! ఓవైపు ఆటోమొబైల్ హబ్గా ఉన్న తమిళనాడు మరోవైపు వాణిజ్య రాజధాని స్టేటస్ అనుభవిస్తున్న మహారాష్ట్ర! ఈ రెండింటినీ కాదని దక్షిణ కొరియా నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో ఆగింది కియా కార్! తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలకు అప్పట్లో అదో బిగ్ షాక్! అదీ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ వాల్యూ! మరి ఇప్పుడు పారిశ్రామిక వర్గాల్లో ఆంధ్రప్రదేశ్కు అలాంటి పరపతే ఉందా? ఉండుంటే గత నాలుగున్నరేళ్లలో కియాలాంటి చెప్పుకోదగ్గ సంస్థ ఒక్కటైనా ఏపీలో కాలుపెట్టిందా? లేదు సరికదా ఉన్నవే పారిపోయే పరిస్థితి! తెలుగుదేశం హయాంలో ఉత్సాహంగా ముందుకొచ్చిన కియా అనుబంధ పరిశ్రమలు కూడా ఇప్పుడు ముఖం చాటేశాయి. ఇదీ నేడు మసక బారిన ఏపీ బ్రాండ్.
Industries Shifting to Other State From Andhra Pradesh :అసలు ఆనాటి ప్రభుత్వం ఏపీ బ్రాండ్ను ఎలా బిల్డ్ చేసింది? వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ స్లోగన్తో రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణం సృష్టించారు నాటి సీఎం చంద్రబాబు. థావోస్ వెళ్లారు. అక్కడ రాష్ట్రంలోని అనుకూలతలు వివరించారు. పారిశ్రామికవేత్తల్ని మెప్పించారు. పరిశ్రమలను ఒప్పించారు. మరి జగన్ కూడా థావోస్ వెళ్లారు కదా? అంటారా? ఒక్క థావోస్ ఏంటి? జగన్ అధికారంలోకి వచ్చాక పెట్టుబడుల ఆకర్షణ కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం 15 ఔట్రీచ్లలో పాల్గొంది. కానీ రాష్ట్రానికి చెప్పుకోదగ్గ ఒక్కసంస్థనీ తీసుకురాలేకపోయింది! దావోస్ వెళ్లి కూడా అదానీ, అరబిందో సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. దేశీ సంస్థలతో ఒప్పందాల కోసం దావోస్ వెళ్లడం ఎందుకనే విమర్శలు తప్ప ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తీసురాలేకపోయారు జగన్!
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు వెనుకంజ!
రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని కక్ష, కార్పణ్యాలకు కేరాఫ్గా మార్చిన జగన్ పారిశ్రామికంగానూ అదే పంథా అవలంబించారు! దానికి ఉదాహరణే అమరరాజా బ్యాటరీస్. అమరరాజాను జగన్ సర్కార్ చిత్తూరు జిల్లాకు పారిశ్రామిక గుర్తింపు తెచ్చిన దిగ్గజంగా చూడకుండా తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్కు చెందిన సంస్థగా చూసింది. కాలుష్యం పేరుతో పొగపెట్టింది. దానికి మూల్యమే 10 వేలకోట్ల రూపాయల వ్యాపార విస్తరణనుఅమరరాజా తెలంగాణకు మళ్లించింది. ఇలా స్వరాష్ట్రంలోనే ఏపీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీశారు జగన్. గత ప్రభుత్వం స్నేహపూర్వక సంబంధాలతో మేడిన్ ఏపీ అంటూ పరిశ్రమల్ని రెక్కలు కట్టుకుని వాలేలా చేస్తే వైఎస్సార్సీపీ సర్కార్ అరాచక ఆలోచనలు, విధ్వంకర విధానాలు, హింసాత్మక పరిణామాలతో కొత్తగా రాబట్టిందేమీ లేకపోగా.. పాత పరిశ్రమల భద్రతనే ప్రశ్నార్థకం చేసింది. అందుకే పారిశ్రామిక వేత్తలకు నేడు ఏపీ అంటేనే బీపీ పెరిగే పరిస్థితి వచ్చింది.